Fuel Subsidies : సంప్రదాయేతర ఇంధన వనరుల వైపు మళ్లాలని ప్రపంచ దేశాలన్నీ కోరుకుంటున్నదే. బొగ్గు, చమురు, గ్యాస్ తదితర శిలాజ ఇంధనాలపై సబ్సిడీలను 2009 నాటి స్థాయులకు తగ్గించాలని జీ-20 దేశాల కూటమి నిర్ణయించాయి కూడా. అందుకు భిన్నంగా 2022లో ప్రత్యక్ష, పరోక్ష సబ్సిడీల మొత్తం 7 ట్రిలియన్ డాలర్లకు చేరినట్టు అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ(ఐఎంఎఫ్) లెక్కలను చూస్తే బోధపడుతోంది.
ఉక్రెయిన్ యుద్ధం దరిమిలా ముడి చమురు ధరలు పెరగడంతో నిరుడు సబ్సిడీల బిల్లు పెరుగుదలకు ఓ కారణం. అయితే అంతకు ముందు సంవత్సరాలుగా సబ్సిడీలు పెరుగుతూ వస్తున్నట్టు స్పష్టమవుతోంది. గ్లోబల్ సౌత్ దేశాల ఆర్థిక పురోగమనం కారణంగా బొగ్గు, చమురు, గ్యాస్ వాడకం గణనీయంగా పెరిగింది.
ఇండియా, బ్రెజిల్, పాకిస్థాన్, ఇండొనేసియా, చైనా, నైజీరియా, మెక్సికో సహా 78 దేశాలు గ్లోబల్ సౌత్ జాబితాలో ఉన్నాయి. ప్రపంచ జీడీపీలో 7 శాతం మేర శిలాజ ఇంధన సబ్సిడీల కోసం వెచ్చిస్తున్నారు. ప్రపంచ దేశాలన్నీ కలిపి విద్యపై వెచ్చిస్తున్నది 4.3 శాతమే. అంటే సబ్సిడీలపై వ్యయం ఎంతలా ఉందో అర్థం చేసుకోవచ్చు.
2015-22 మధ్య ఐఎంఎఫ్ ఇచ్చిన గణాంకాల ప్రకారం శిలాజ ఇంధనాలపై పరోక్ష సబ్సిడీలే ఎక్కువ మొత్తంలో ఉన్నాయి. 2015లో ప్రత్యక్ష, పరోక్ష సబ్సిడీల మొత్తం 4.5 ట్రిలియన్ డాలర్లుగా ఉంది. ఏడేళ్లలో అది 7 ట్రిలియన్ డాలర్లకు చేరింది.