కాంగ్రెస్ గెలుపు గుర్రాల ఎంపికపై కసరత్తు కంటిన్యూ అవుతోంది. కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ భేటీ వరుస భేటీల అనంతరం అభ్యర్థుల లిస్ట్పై కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ భేటీ అయ్యింది. రెండున్నర గంటలపాటు అభ్యర్థుల ఎంపికపై సీఈసీలో చర్చలు జరిగాయి. శుక్రవారం 70 సీట్లపై చర్చ జరిగింది. అయితే కమ్యూనిస్టులతో పొత్తు.. వారికి సీట్ల కేటాయింపుపై కూడా కాంగ్రెస్ కసరత్తు చేస్తోంది. ఈ విషయంపై క్లారిటీ వస్తే అన్ని నియోజకవర్గాల అభ్యర్థులను కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించే అవకాశం కనిపిస్తోంది.
శుక్రవారం భేటీలో 70 మంది అభ్యర్థులను దాదాపుగా ఖరారు చేసింది కాంగ్రెస్. దీంతో 119 నియోజకవర్గాలున్న తెలంగాణలో సగానికి పైగా స్థానాలకు టికెట్లు ఫైనల్ చేసినట్టయ్యింది. పార్టీలో పనిచేసిన అనుభవం, కుల సమీకరణాలు, సర్వేలు, ఆర్థిక బలాలను దృష్టిలో పెట్టుకొని స్క్రీనింగ్ కమిటీ ఇచ్చిన నివేదికల ఆధారంగా తొలి విడతగా 70 మంది అభ్యర్థులను కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ ఎంపిక చేసింది.
మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన ఢిల్లీలో ఏఐసీసీ కార్యాలయంలో సీఈసీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి సోనియా, రాహుల్, ప్రియాంకా గాంధీతోపాటు కేసీ వేణుగోపాల్, ఎంపీ ఉత్తమ్కుమార్ రెడ్డి సహా ఇతర కమిటీ సభ్యులు హాజరయ్యారు. తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి మాణిక్రావ్ ఠాక్రే, పీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, స్క్రీనింగ్ కమిటీ ఛైర్మన్ మురళీధరన్లను సైతం ఈ భేటీకి ఆహ్వానించారు.
రెండున్నర గంటలపాటు జరిగిన ఈ సమావేశంలో.. ఎన్నికల వ్యూహకర్త సునీల్ కనుగోలు సహా ఏఐసీసీ స్థాయిలో చేసిన సర్వేల నివేదికలు ముందుపెట్టుకొని నియోజకవర్గాల వారీగా అభ్యర్థులను పరిశీలించారు. మొదట ఒకే ఒక్క పేరున్న 70 నియోజకవర్గాలు, ఆయా స్థానాలకు సంబంధించిన నేతల పేర్లు పరిశీలించారు. ఏయే ప్రాతిపదికన ఇక్కడ ఒకే నేత ఎంపిక జరిగిందో కమిటీకి వివరించారు మురళీధరన్.
ఇక రెండో విడత జాబితాను ఫైనల్ చేసేందుకు వచ్చేవారం మరోసారి సమావేశంకానుంది సీఈసీ. దసరాకు ముందే ఈ నెల 18న రెండో విడత జాబితా విడుదల చేయాలని సీఈసీ సమావేశంలో నిర్ణయించినట్లు తెలుస్తోంది. కమ్యూనిస్టులతో పొత్తు, వారికి ఇవ్వాల్సిన సీట్ల కేటాయింపుపైనా చర్చించినట్లు తెలుస్తోంది. మిర్యాలగూడ, మునుగోడు, ఖమ్మం, కొత్తగూడెం, హుస్నాబాద్ స్థానాలపై చర్చించినట్లు సమాచారం. అయితే దీనిపై ఈ సమావేశం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. అనంతరం జరిగిన సీఈసీ సమావేశంలోనూ పొత్తు, సీట్ల కేటాయింపు అంశంపై చర్చించారు. ఒకట్రెండు రోజుల్లో పొత్తు తేల్చాలని కేసీ వేణుగోపాల్, రేవంత్కు హైకమాండ్ పెద్దలు సూచించినట్లు సమాచారం. టికెట్ దక్కని నేతలతో వారికున్న ప్రాధాన్యాన్ని బట్టి నేరుగా హైకమాండ్ పెద్దలు మాట్లాడాలన్న రాష్ట్ర నేతల సూచనకు అధిష్టానం ఓకే చెప్పినట్లు తెలుస్తోంది.