Gaza Flee: ప్రతీకారేచ్ఛతో రగిలిపోతున్న ఇజ్రాయెల్ గాజాపై దండయాత్రకు సిద్ధమైపోయింది. ఇప్పటికే 3 లక్షల మంది సైనికులు సరిహద్దుల్లో మోహరించారు. ఉత్తర గాజా పౌరులను పారిపొమ్మంటూ ఇజ్రాయెల్ రక్షణ బలగాలు(ఐడీఎఫ్) ఇప్పటికే అల్టిమేటం ఇచ్చాయి. మరో వైపు గాజాకు ఆహారం, ఇంధనం, విద్యుత్తు, మందుల సరఫరాను నిలిపివేసింది.
ఇంధనం లేక అక్కడ ఉన్న ఏకైక విద్యుత్తు ప్లాంట్ బుధవారమే మూలనపడింది. మరో వైపు ఇజ్రాయెల్ వైమానిక దాడులతో గాజా పౌరుల పరిస్థితి దయనీయంగా మారింది. ఆస్పత్రుల్లో ఉన్న కొద్ది పాటి జనరేటర్ల కూడా పనిచేయని స్థితికి చేరుకుంటే రోగులు, శిశువులు, గర్భిణులకు తీవ్ర ఇబ్బందులు తప్పవని వైద్యులు ఆందోళన చెందుతున్నారు.
బ్యాకప్ జనరేటర్లు కూడా కొన్ని గంటల పాటే పనిచేస్తాయని రెడ్ క్రాస్ ఇంటర్నేషనల్ కమిటీ పేర్కొంది. ఆఖరికి క్షతగాత్రులకు చికిత్స అందించే పరిస్థితి కూడా ఉండదని తెలిపింది. ఆస్పత్రులన్నీ శవాగారాలుగా మిగిలిపోయే ప్రమాదం ఉందని హెచ్చరించింది. గాజా విద్యుత్తు అవసరాల్లో సగం ఇజ్రాయెలే తీరుస్తోంది. హమాస్ దాడికి ముందు కూడా గాజాలో విద్యుత్తు సరఫరా అంతంతమాత్రంగానే ఉండేది. మొత్తం మీద 12 గంటలు మాత్రమే పౌరులకు విద్యుత్తు అందేది.
24 గంటల్లోగా గాజాను విడిచి వెళ్లాలంటూ ఇజ్రాయెల్ చేసిన హెచ్చరిక.. గాజన్లను మరింత కష్టాల్లోకి నెట్టింది. ఐక్యరాజ్యసమితి అంచనా మేరకు ఇప్పటికే 2.6 లక్షల మంది గాజాను విడిచిపెట్టారు. ఇప్పుడు ఉత్తర గాజాలోని 11 లక్షల మంది పౌరులు సురక్షిత ప్రాంతాలకు చేరడం ఎలాగో తెలియక బిక్కుబిక్కుమంటున్నారు.
41 కిలోమీటర్ల పొడవు, 6-12 కిలోమీటర్ల వెడల్పు ఉన్న అతి సన్నటి తీర ప్రాంతం గాజాను ఐదు ప్రధాన ప్రాంతాలు.. ఉత్తర గాజా, గాజా, మిడిల్ ఏరియా, ఖాన్ యూనిస్, రఫాగా విభజించారు. గాజాస్ట్రిప్కు ఉత్తర-తూర్పు దిశగా ఇజ్రాయెల్, దక్షిణాన ఈజిప్టు సరిహద్దులుగా ఉన్నాయి. ఈ రెండు భూసరిహద్దులు ప్రస్తుతం మూసుకుపోయాయి. పశ్చిమాన మధ్యధరా సముద్రంతో దారి అన్నదే లేకుండా పోయింది.
నిరుడు గాజా విమానాశ్రయాన్ని ధ్వంసం చేసి.. ఆ దేశ గగనతలాన్ని కూడా ఇజ్రాయెలీలు తమ గుప్పిట్లోకి తెచ్చుకున్నారు. అంతే మొత్తం మీద 365 చదరపు కిలోమీటర్ల ఈ చిన్న భూభాగానికి ప్రపంచంతో దాదాపు సంబంధాలు లేనట్లే. ఉత్తర గాజా పౌరులను అక్కడ నుంచి దక్షిణ దిశగా వెళ్లిపోవాలని, ఈజిప్టు సరిహద్దుల్లో ఉన్న రఫాకు చేరుకోవాలని సూచిస్తోంది. అంటే 11 లక్షల మంది జనాభా 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న రఫాకు 24 గంటల్లో చేరాలన్న మాట.
గాజా భూసరిహద్దుల్లో ఉన్న రెండు ప్రధాన ఎంట్రీ/ఎగ్జిట్ పాయింట్ల నుంచే పౌరులను అనుమతించాల్సి ఉంటుంది. వాటిలో ఎరెజ్ క్రాసింగ్ను ఇజ్రాయెల్ నియంత్రిస్తుండగా.. రఫా క్రాసింగ్ ఈజిప్టు నియంత్రణలో ఉంది. గాజా నుంచి పారిపోవాలనుకునే పౌరులకు ఈ రెండు దారులు మూసుకుపోయాయి. ఇక మూడో క్రాసింగ్.. కేరెమ్ షాలోమ్ పూర్తిగా ఇజ్రాయెల్ స్వాధీనంలో ఉంటుంది. అయినా ఈ మార్గం గుండా సరకు రవాణాను మాత్రమే అనుమతిస్తుంటారు. ఇజ్రాయెల్ నియంత్రణలోని రెండు పాయింట్ నుంచి పౌరులను అనుమతించే వీలు లేనందున.. మిణుకుమిణుకుమంటున్నగాజన్ల ఆశలన్నీ ఈజిప్టు సరిహద్దులపైనే!