Chandrababu Health Update : రాజమండ్రి జైలులో ఉన్న టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ప్రాణాలకు ముప్పు ఉందని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆందోళన చెందారు. చంద్రబాబుపై స్టెరాయిడ్లు ప్రయోగించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని, ఆయన ఆరోగ్య పరిస్థితిపై ప్రభుత్వ వైద్యులు, జైలు యంత్రాంగం వాస్తవాలను దాచిపెడుతున్నారని మండిపడ్డారు. చంద్రబాబుకు ఏదైనా హాని జరిగితే జగన్ దే బాధ్యత అని లోకేష్ పేర్కొన్నారు. జైలులో తగినంత భద్రత లేక చంద్రబాబు ఎంతో ప్రమాదంలో ఉన్నారని, జైలులో చంద్రబాబు భయంకరమైన పరిస్థితులను ఎదుర్కొంటున్నారన్నారు.
జైల్లో దోమలు, కలుషిత నీటితో ఇబ్బంది పడుతూ.. ఇన్ఫెక్షన్, అలర్జీలతో బాధపడుతున్నారని వాపోయారు. అపరిశుభ్ర వాతావరణంలో ఆయనను ఉంచుతున్నారని, అది చంద్రబాబు ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుందని ఆందోళన చెందారు. జైల్లో సరైన వైద్యం అందడం లేదని, తక్షణమే వైద్య సహాయం అవసరమని లోకేష్ తెలిపారు. చంద్రబాబునాయుడు భార్య సైతం ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటి వరకూ ఆయన 5 కేజీల బరువు తగ్గారని, ఆయనకు ప్రాణహాని ఉందని ఆందోళన చెందారు. చంద్రబాబు నాయుడు ఆరోగ్యంపై .. కుటుంబ సభ్యులు, టీడీపీ శ్రేణుల వర్షన్ ఇలా ఉంటే.. జైళ్ల శాఖ డీజీపీ వర్షన్ మరోలా ఉంది.
రాజమండ్రి సెంట్రల్ జైల్లో చంద్రబాబు భద్రతపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని జైలు శాఖ డీఐజీ రవికిరణ్ స్పష్టం చేశారు. జైలులో ఆయన అనారోగ్యానికి గురైన మాట వాస్తవమేనని.. అయితే సరైన టైమ్ లో వైద్యం అందించామని తెలిపారు. బాబు జైలుకు వచ్చినపుడు 66 కేజీల బరువు ఉండగా.. ప్రస్తుతం 67 కేజీల బరువు ఉన్నారని, ఆయన ఒక కిలో బరువు పెరిగారే తప్ప తగ్గలేదని తెలిపారు.