Ground Operation: ఇజ్రాయెల్ గగనతల దాడులతో గాజా గజగజలాడుతోంది. ఆహారం, ఇంధనం, విద్యుత్తు సరఫరాను నిలిపివేయడంతో పరిస్థితి మరింత దిగజారింది. హమాస్ చేతుల్లో బందీలుగా ఉన్న 150 మంది ఇజ్రాయెలీలు, ఇతర దేశస్థులదరినీ విడిపించుకునే వరకు ముమ్మర దాడులు తప్పవని ఇప్పటికే ఇజ్రాయెల్ రక్షణ బలగాలు(ఐడీఎఫ్) హెచ్చరించాయి. గ్రౌండ్ ఆపరేషన్ చేపట్టేందుకూ సన్నద్ధమైంది.
ఇందులో భాగంగానే ఉత్తర గాజాలోని 11 లక్షల మందిని వెంటనే సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోవాలని ఐడీఎఫ్ ఆదేశాలు జారీ చేసింది. దాదాపు 3 లక్షల మంది సైన్యం ఈ గ్రౌండ్ ఆపరేషన్లో పాల్గొనే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది. గాజాలోని 483 కిలోమీటర్ల మేర విస్తరించిన సొరంగాల వ్యవస్థలో నక్కిన హమాస్ మిలిమెంట్లు ఇజ్రాయెల్ దాడులకు తెగబడ్డారు. బందీలను కూడా అక్కడే ఉంచినట్టు ఐడీఎఫ్ అనుమానిస్తోంది.
అయితే గాజాలోకి చొచ్చుకుపోవడంతో పాటు సొరంగాలను ఛేదించడం ఇజ్రాయెల్ దళాలకు కత్తి మీద సామే కావొచ్చు. అడుగడుగునా ఏర్పాటు చేసిన బూబీట్రాప్లు, హమాస్ గెరిల్లా యుద్ధ తంత్రాలు వారికి పెనుసవాల్ కానున్నాయి. 2021లోనే ఇజ్రాయెల్ 100 కిలోమీటర్ల మేర అండర్ గ్రౌండ్ టన్నెళ్లను ధ్వంసం చేయగలిగింది. అయితే ఎప్పటికప్పుడు టన్నెల్ వ్యవస్థను మెరుగుపరుస్తూ కోట్ల కొద్దీ నిధులను హమాస్ వెచ్చిస్తోంది. పాలస్తీనా పౌరులకు అందుతున్న సాయంలో అధిక మొత్తంలో నిధులను ఇందుకోసమే మళ్లిస్తున్నట్టు ఆరోపణలు ఉన్నాయి.
గతంలో దాడులు చేసినప్పుడు హమాస్ మిలిటెంట్లు వినియోగించిన సొరంగాల ప్రవేశమార్గాలు పౌరులు నివసించే భవన సముదాయాలు, స్కూళ్లలో తేలాయి. కొన్ని సొరంగాలు అయితే భూమికి 130 అడుగుల దిగువన కింద ఏర్పాటయ్యాయి. గగనతల దాడుల నుంచి తప్పించుకునేందుకు మిలిటెంట్లకు ఇవే ఆసరా అయ్యాయి. 2006లో తొలిసారి వీటి గురించి వెలుగులోకి వచ్చింది.
అయితే ఉగ్రదాడుల కోసం అప్పట్లో వీటిని వాడిన దాఖలాలు లేవు. ఇజ్రాయెల్ కల్పించే ఆటంకాలను అధిగమించి.. 23 లక్షల మంది పాలస్తీనియన్లకు ఆహారం, ఇతర అత్యవసరాలను తరలించేందుకు ఈ సొరంగ వ్యవస్థ ఉపయోగపడేది. అలా క్రమేపీ సొరంగాలను విస్తరించుకుంటూ వచ్చారు. బందీలను విడిపించేందుకు నెతన్యాహు సర్కారుకు గ్రౌండ్ ఆపరేషన్ వినా మార్గం లేదు. 2014 తర్వాత భారీ సైనిక చర్యకు దిగడం మళ్లీ ఇప్పుడే.