తెలంగాణలో ఎన్నికల వేళ భారీగా నగదు, బంగారం పట్టుబడుతున్నాయి. ఎలక్షన్ కోడ్ అమలులో ఉండటంతో పోలీసులు విస్తృత తనిఖీలు చేపడుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా చెక్పోస్టుల వద్ద నిఘా పెంచారు. ప్రతీ వాహనాన్ని క్షుణ్ణంగా పరిలీస్తున్నారు. తనిఖీల్లో భారీగా నోట్ల కట్టలతోపాటు బంగారం కూడా పట్టుబడుతోంది.
ఎన్నికల నోటిఫికేషన్ వెలువడటంతో ఆ రోజు నుంచే పోలీసులు అక్రమ తరలింపులపై నిఘా పెంచారు. ఈ తనిఖీల్లో ఇప్పటి వరకూ 37.07 కోట్ల విలువైన నగదు, బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. గురువారం నాటికి రూ.20.43 కోట్ల నగదు, రూ.14.66 కోట్ల విలువైన బంగారం, వెండి, 89 లక్షల రూపాయల విలువైన మాదకద్రవ్యాలు, 87 లక్షల రూపాయల విలువైన మద్యం నిల్వలు, పంపిణీకి సిద్ధం చేసిన 22.51 లక్షల రూపాయల విలువ చేసే వస్తువులను తనిఖీల్లో స్వాధీనం చేసుకున్నట్టు అధికారులు తెలిపారు. శుక్రవారం ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చింతలకుంట వద్ద పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో ముగ్గురు వ్యక్తుల నుంచి 23లక్షల రూపాయల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
అధికారం కోసం ఓటర్లను మభ్యపెట్టి తమవైపుకి తిప్పుకునేందుకు ఆయా పార్టీల నేతలు ప్రయత్నిస్తుండటంతో పోలీసుల తనిఖీలు కొనసాగుతున్నాయి. అంతర్రాష్ట్ర సరిహద్దుల్లో 89, తెలంగాణ వ్యాప్తంగా 169 ప్రాంతాల్లో ముమ్మర తనిఖీలు నిర్వహిస్తున్నారు. కాగా.. ఎన్నికల కోడ్ అమలులో ఉన్న నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా తనిఖీలు నిర్వహించేందుకు వేయికిపైగా తనిఖీల బృందాలను ఏర్పాటు చేశారు అధికారులు.