Ponnala Lakshmaiah : సీనియర్ నేత, మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. ఎన్నికల్లో పార్టీ నుంచి పోటీ చేసే అభ్యర్థుల ఎంపికలో అవకతవకలు జరుగుతున్నాయని ఆరోపిస్తూ.. ఆయన పార్టీని వీడుతున్నట్లు వెల్లడించారు. పార్టీ అంశాలను చర్చించేందుకు కూడా అవకాశం ఇవ్వడం లేదని పొన్నాల మండిపడ్డారు. పార్టీలో బీసీలకు అన్యాయం జరుగుతోందని ఆయన అసహనం వ్యక్తం చేశారు. ఏదైనా అంశం గురించి చర్చించాలంటే నెలల తరబడి అపాయింట్ మెంట్ కోసం ఎదురుచూడాల్సి రావడం దురదృష్టకరమన్నారు.
ఢిల్లీకి వచ్చి 10 రోజులైనా.. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్ ను కలిసేందుకు ఇంతవరకూ 1 నిమిషం సమయం కూడా ఇవ్వలేదన్నారు. సీట్ల కేటాయింపులో బీసీలకు ప్రాధాన్యమివ్వాలని అడిగేందుకు వచ్చిన బీసీ నాయకులను ఏఐసీసీ నాయకులు కలవడానికి కూడా సమయం ఇవ్వకపోవడం అవమానకరమని పొన్నాల లక్ష్మయ్య అభిప్రాయపడ్డారు. ఆత్మగౌరవాన్ని తాకట్టుపెట్టి.. ఒక బీసీ అగ్రనాయకుల చుట్టూ తిరిగితే పార్టీ పరువు పోతుందన్నారు.
కాగా.. కాంగ్రెస్కు రాజీనామా చేసిన పొన్నాల త్వరలో బీఆర్ఎస్లో చేరుతారని తెలుస్తోంది. ఈ నెల 16న ఆయన కారెక్కనున్నట్లు సమాచారం. జనగామలో జరిగే కేసీఆర్ బహిరంగసభలో ఆయన బీఆర్ఎస్లో చేరనున్నట్లు పొన్నాల సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. అయితే పొన్నాలను బీఆర్ఎస్లోకి తీసుకొచ్చేందుకు తెర వెనుక హరీష్ రావు చక్రం తిప్పిన్నట్లు తెలుస్తోంది.