Israel-Palastine War : ఇజ్రాయెల్-హమాస్ల మధ్య కొనసాగుతున్న భీకర యుద్ధం మారణహోమాన్ని సృష్టిస్తోంది. ఈ వార్లో వేలాది మంది మరణంతో ఆర్తనాదాలు, హాహాకారాలతో మృత్యుఘోషతో విలపిస్తున్నారు. చిన్నపిల్లలు, మహిళల పట్ల కూడా హమాస్ ఉగ్రవాదులు కణికరం చూపడం లేదు. అమానుషంగా వ్యవహరిస్తూ చేతులకు సంకెళ్లు వేసి వారి తలలను నరికేస్తూ రాక్షసత్వాన్ని వెళ్లగక్కుతున్నారు. అడ్డొచ్చిన వారిని ఎక్కడికక్కడ చంపేస్తుండటంతో భయానక వాతావరణంలో బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు జనం.
ఇలాంటి భీతావహ సమయంలో ఇజ్రాయెల్లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి రప్పించేందుకు ఆపరేషన్ అజయ్ను చేపట్టింది. ఇందులో భాగంగా ఇవాళ మొదటి చార్టర్ విమానం 212 మందితో ఇజ్రాయెల్లోని బెన్గురియన్ ఎయిర్పోర్టు నుంచి ఢిల్లీకి చేరుకుంది. ఈ విమానం గురువారం రాత్రి బయలుదేరగా ఈరోజు ఉదయం ఇండియాకు చేరుకుంది. ఇక ఇజ్రాయెల్ నుంచి భారత్కు చేరుకున్న స్వదేశీయులకు కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ స్వాగతం పలికి అక్కడి పరిస్థితులు, వారి క్షేమ సమాచారంపై ఆరా తీశారు. స్వదేశానికి చేరుకున్న వారిలో ఆంధ్రప్రదేశ్ కు చెందిన వారు 9 మంది ఉన్నారు.
మరోవైపు ఇజ్రాయెల్ సైన్యం.. గాజాలో ఉన్న హమాస్ మిలిటెంట్లపై యుద్ధాన్ని మరింత తీవ్రతరం చేసేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలోనే నార్త్ గాజాలో ఉన్న 11 లక్షల మంది పాలస్తీనా పౌరులు 24 గంటల్లో ఆ ప్రాంతాన్ని వదిలి వెళ్లాలని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ (ఐడీఎఫ్) ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాలపై ఐక్యరాజ్యసమితి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ పరిణామాలు దారుణమైన మానవతా సంక్షోభాన్ని సృష్టిస్తాయని ఐక్యరాజ్యసమితి ఆందోళన వ్యక్తం చేసింది. ఉత్తర గాజా టన్నెల్స్ లో దాక్కుని ఉన్న హమాస్ మిలిటెంట్ల కోసమే ఈ రీ లొకేషన్ ఆదేశాలను జారీ చేశామని ఐడీఎఫ్ వెల్లడించింది.