మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబుకు ఏపీ హైకోర్టులో ఊరట లభించింది. అంగళ్ల కేసులో ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసులో ఏ1 ముద్దాయిగా ఉన్న ఆయనకు లక్ష రూపాయల పూచికత్తుతో బెయిల్ మంజూరు చేసింది. ప్రస్తుతం చంద్రబాబును పలు కేసులు వెంటాడుతున్న తరుణంలో బెయిల్ మంజూరుతో కాస్త ఊరట లభించిందనే చెప్పాలి.
యుద్ధభేరీ పేరుతో చంద్రబాబు సాగునీటి కోసం ప్రాజెక్టులను సందర్శించారు. టూర్లో భాగంగా ఆగస్ట్ 14న అన్నమయ్య జిల్లాలో పర్యటించారు. అంగళ్లు మీదుగా వెళ్తుండగా వైసీపీ, టీడీపీ శ్రేణుల మధ్య తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఈ ఘటనలో విధ్వంసం సృష్టించారని ఆరోపిస్తూ చంద్రబాబుతోపాటు ఆ పార్టీకి చెందిన 179 మంది నేతలపై ముదివేడు పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే.. ఈ కేసులో చంద్రబాబును ఏ1 ముద్దాయిగా చేర్చిన పోలీసులు.. హత్యాయత్నంతోపాటు ఇతర సెక్షన్లపై కేసులు నమోదు చేశారు. ఈ కేసులపై బెయిల్ కోరుతూ హైకోర్టును ఆశ్రయించారు టీడీపీ నేతలు. ఇందులో పలువురికి ఇప్పటికే బెయిల్ మంజూరు చేసింది హైకోర్టు. ఏ1గా ఉన్న చంద్రబాబు ముందస్తు బెయిల్ కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం ఇరు వైపుల వాదనలు విన్న తర్వాత లక్ష రూపాయల పూచికత్తుతో బెయిల్ మంజూరు చేసింది.
ఇక ఇప్పటికే స్కిల్ స్కాం కేసులో చంద్రబాబు జైలు జీవితాన్ని అనుభవిస్తున్నారు. ఈ కేసుతో పాటు పలు కేసులు కూడా ఆయనను వెంటాడుతున్నాయి. కేసుల నుంచి బయటకు పడేందుకు ఏసీబీ, హైకోర్టు, సుప్రీంకోర్టులను ఆశ్రయించారు. జగన్ రాజకీయ కుట్రలో భాగంగానే అక్రమ కేసులు పెడుతున్నారని ఆరోపిస్తున్నారు.