Psyche postpone : విలువైన లోహాలతో నిండి ఉన్నట్టు అందరూ భావిస్తున్న 16 సైకీ గ్రహశకలంపైకి తలపెట్టిన ప్రయోగం వాయిదా పడింది. ఆ ఆస్టరాయిడ్ని అధ్యయనం చేసేందుకు నాసా 16 సైకీ మిషన్ను చేపట్టింది. గురువారం సైకీ అంతరిక్ష నౌక ప్రయోగం జరగాల్సి ఉండగా.. వాతావరణం 20 శాతమే అనుకూలంగా ఉంది. దీంతో ప్రయోగం ఒక రోజు వాయిదా పడింది.
అన్నీ అనుకూలిస్తే భారత కాలమానం ప్రకారం శుక్రవారం రాత్రి 7.49 గంటలకు ఫ్లోరిడాలోని కెనెడీ స్పేస్ సెంటర్ నుంచి ఈ వ్యోమ నౌక బయల్దేరుతుంది. స్పేస్ ఎక్స్ భారీ రాకెట్లలో ఒకటైన ఫాల్కన్ హెవీ ద్వారా సైకీ స్పేస్ క్రాఫ్ట్ను అంతరిక్షంలోకి పంపుతారు. భూమి నుంచి 3.6 బిలియన్ కిలోమీటర్ల దూరంలో అంగారక, గురుగ్రహాల మధ్య ఉన్న ఈ ఆస్టరాయిడ్ని వ్యోమనౌక చేరేందుకు ఏడేళ్లు పడుతుంది.
ఇంత సుదీర్ఘ ప్రయాణానికి అవసరమైన ఇంధనాన్ని సౌరశక్తి ద్వారా పొందేలా నాసా శాస్త్రవేత్తలు ఈ వ్యోమ నౌకను విశిష్ఠంగా డిజైన్ చేశారు. స్పేస్క్రాఫ్ట్కు అమర్చిన సోలార్ ప్యానెళ్లు సౌర కాంతిని విద్యుత్తుగా మార్చుకుంటాయి. తద్వారా దానికి అమర్చిన నాలుగు సోలార్ ఎలక్ట్రిక్ థ్రస్టర్లు(హాల్ ఎఫెక్ట్ థ్రస్టర్లు) పనిచేస్తాయి.
విశ్వం లోపలికి ప్రయాణించే కొద్దీ వ్యోమనౌక నుంచి సమాచారం పొందాలంటే అత్యధిక డేటా రేట్ అవసరం. ఇందుకోసం రేడియో ఫ్రీక్వెన్సీ ఆధారిత కమ్యూనికేషన్లకు బదులుగా లేజర్ ఆధారిత వ్యవస్థలనే నాసా నమ్ముకుంది. సంప్రదాయ టెలికాం డేటా రేట్ కంటే పది రెట్ల వేగంతో సమాచారాన్ని పొందే సాంకేతికతను సైకీ లో పొందుపర్చినట్టు నాసా జెట్ ప్రొపల్షన్ లాబొరేటరీ శాస్త్రవేత్తలు వెల్లడించారు. అంగారక గ్రహంపైకి మానవ సహిత ప్రయోగాలు చేపట్టడంలో ఈ టెక్నాలజీ ఉపయోగపడగలదని విశ్వసిస్తున్నారు.
ఆస్టరాయిడ్పై ఖనిజాల విశ్లేషణకు అవసరమైన పరికరాలు సైతం సైకీలో ఉన్నాయి. ఇనుము, నికెల్, బంగారం లోహాలతో పాటు మట్టి కలగలసి ఉన్న ఆస్టరాయిడ్ ఇది. అయస్కాంత శక్తి ఉన్నప్పుడే ఇలా లోహాలను పట్టి ఉంచే లక్షణం ఉంటుంది. ఆ అయస్కాంత శక్తిని మదింపు చేయడంపైనా నాసా ఈ ప్రయోగం ద్వారా దృష్టి సారించింది. సైకీ గ్రహశకలంలో ఉన్న 10,000 క్వాడ్రిలియన్ డాలర్ల విలువైన(మన కరెన్సీలో 832.53 కోట్ల కోట్ల రూపాయలకు సమానం) లోహాల కోసం ఈ అన్వేషణ విజయవంతమైతే మానవులకు అంతకన్నా కావాల్సింది ఏముంటుంది?