Dharmapuri : దక్షిణ కాశీగా పేరు గాంచిన ప్రాంతం ధర్మపురి. నరసింహస్వామి దేవాలయంతో ఈ ఖ్యాతి వచ్చింది. ఈ ప్రాంతానికి సమీపంలోనే గోదావరి నది ఉంది. అయినా సరే ప్రజల నీటి కష్టాలు తీరడంలేదు. ఎస్పిఎస్ఆర్ ,ఎల్లంపల్లి ప్రాజెక్టుల ద్వారా సిద్ధిపేట, హైదరాబాద్ ప్రాంతాలకు నీటిని సరఫరా చేస్తున్నారు. దీంతో స్థానికులకు నీటి కష్టాలు తప్పటంలేదు. మరోవైపు ఎల్లంపల్లి ప్రాజెక్టు నిర్మాణం కోసం స్థానికుల నుంచి భూమిని సేకరించారు. అయితే ఇప్పటికీ కొందరికి పరిహారం అందలేదని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
ధర్మపురి నియోజకవర్గంలో పట్టణ ప్రాంతాలు కాస్త అభివృద్ధి చెందినా .. సరైన డ్రైనేజీ వ్యవస్థ మాత్రం లేదు. గ్రామాలు సమస్యల వలయంలోనే కొట్టుమిట్టాడుతున్నాయి. మంత్రి కొప్పుల ఈశ్వర్ ప్రాతినిధ్యం వహిస్తున్న ధర్మిపురి నియోజకవర్గంలో పరిస్థితులు ఇలా ఉన్నాయి.
డీలిమిటేషన్ తో 2009లో ధర్మపురి నియోజకవర్గం ఏర్పడింది. ఇది ఎస్సీ రిజర్వడ్ సెగ్మెంట్. ఈ నియోజకవర్గం బీఆర్ఎస్ కు కంచుకోటగా ఉంది. ఇక్కడ 2009 నుంచి గులాబీ జెండా మాత్రమే ఎగిరింది. ఉపఎన్నిక సహా 4సార్లు బీఆర్ఎస్ సీనియర్ లీడర్ కొప్పుల ఈశ్వర్ విజయఢంకా మోగించారు. అయితే ఆయనకు 2018 ఎన్నికల్లో విజయం అంతసులభంగా దక్కలేదు. స్వల్ప మెజార్టీతో బయటపడ్డారు. ఇక్కడ బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు బలంగా ఉన్నాయి. బీజేపీ ప్రాబల్యం అంతంత మాత్రమే. గత మూడు ఎన్నికల్లో కాషాయ పార్టీకి 10 శాతం లోపే ఓట్లు వచ్చాయి.
ఈ నియోజకవర్గంలో ధర్మపురి, గొల్లపల్లి, వెల్గ్ టూర్, పెగడపల్లి, ధర్మారం, బుగ్గారం మండలాలున్నాయి. ఈ సెగ్మెంట్ లో 2018 ఎన్నికల నాటికి 2,18, 568 మంది ఓటర్లు ఉన్నారు. 2018 ఎన్నికల్లో 80.19 శాతం పోలింగ్ నమోదైంది.
ప్రస్తుతం 2, 24, 724 మంది ఓటర్లు ఉన్నారు. అందులో పురుష ఓటర్లు 1,09,963 , మహిళా ఓటర్లు 1,14,622 , ట్రాన్స్ జెండర్స్ ఆరుగురు, సర్వీస్ ఓటర్లు 133 మంది ఉన్నారు. 2018 ఎన్నికల కంటే ఇప్పుడు 6,156 ఓట్లు అధికంగా ఉన్నాయి.
ధర్మపురి నియోజకవర్గంలో మాదిగలు, మున్నూరు కాపుల జనాభా ఎక్కువ. ఆ తర్వాత గౌడ్లు, ముదిరాజ్ సామాజికవర్గాల ఓట్లు గెలుపోటములను నిర్ణయించే సంఖ్యలో ఉన్నాయి. మాదిగలు 18 శాతం, మున్నూరు కాపులు 15 శాతం, గౌడ్లు 10 శాతం, ముదిరాజ్ లు 9 శాతం, నేతకానిలు 7 శాతం, యాదవలు 5 శాతం , మాలలు 5 శాతం ఉన్నారు.