తెలంగాణలో హైదరాబాద్, వరంగల్ తర్వాత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతం భువనగిరి. రాష్ట్రంలో మూడో పెద్దనగరంగా భువనగిరిని మారుస్తామని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు. ఈ ప్రాంతాన్ని భవిష్యత్ లో హైదరాబాద్లో కలిపే అవకాశం కూడా ఉంది.
రీజనల్ రింగ్ రోడ్డు ప్రాజెక్టుతో భువనగిరి ఏరియాలో భూముల ధరలకు రెక్కలొచ్చాయి. అయితే RRR ప్రాజెక్టుకు భూములిచ్చిన వారికి పరిహారం అందకపోవడంతో తీవ్ర ఆందోళనలు వ్యక్తమయ్యాయి. నిరసనకారులను అరెస్ట్ చేయడం వివాదాన్ని రేపింది.
మరోవైపు ఈ ప్రాంతంలోని అనేక గ్రామాల గుండా మూసీ నది వెళుతోంది. కాలువలు నిర్మించి సాగునీరు అందిస్తామని రైతులకు ప్రభుత్వం ఇచ్చిన హామీ నెరవేరలేదు. అలాగే సంక్షేమ పథకాలు అమలుపైనా ప్రజల్లో అసంతృప్తి ఉంది. డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఒక శాతం మందికే దక్కాయి. దళిత బంధు పథకం లబ్ధిదారులు 100 మందే. ఇవి భువనగిరి నియోజకవర్గంలోని క్షేత్రస్థాయి పరిస్థితులు.
1957లో భువనగిరి నియోజకవర్గం ఏర్పడింది. తొలి ఎన్నికల్లో పీడీఎఫ్, రెండో ఎన్నికల్లో సీపీఐ అభ్యర్థులు గెలిచారు. ఆ తర్వాత ఇక్కడ కాంగ్రెస్ ను ప్రజలు ఆదరించారు. వరుసగా నాలుగుసార్లు హస్తం పార్టీ అభ్యర్థులే గెలిచారు. తెలంగాణ ఉద్యమనేత కొండా లక్ష్మణ్ బాపూజీ ఇక్కడ నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు. టీడీపీ ఆవిర్భావంతో ఆ పార్టీకి కంచుకోటగా మారింది. తెలంగాణ ఏర్పాటు తర్వాత గులాబీ పార్టీకి అడ్డా అయ్యింది.
రాజకీయంగా భువనగిరిలో టీడీపీకి ఘనమైన చరిత్ర ఉంది. ఎలిమినేటి మాధవరెడ్డి కుటుంబానికి ఓటర్లు 7సార్లు పట్టం కట్టారు. 1985, 89, 94, 99 ఎన్నికల్లో వరుసగా 4 సార్లు మాధవరెడ్డి విజయం సాధించారు. మాధవరెడ్డి నక్సల్స్ దాడిలో మరణించిన తర్వాత ఆయన భార్య ఉమామాధవరెడ్డి 2000లో జరిగిన ఉపఎన్నికల్లో గెలిచారు. ఆ తర్వాత ఆమె 2004, 2009లో మరో రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత భువనగిరి నియోజకవర్గంలో సమీకరణాలు మారిపోయాయి. 2014 ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ తొలిసారిగా విజయభేరి మోగించింది. ఆ పార్టీ అభ్యర్థి పైళ్ల శేఖర్ రెడ్డి గెలిచారు. 2018లోనూ ఆయననే విజయం వరించింది.
ఈ నియోజకవర్గంలో భువనగిరి, భూదాన్ పోచంపల్లి మున్సిపాలిటీలున్నాయి. భువనగిరి, బీబీ నగర్, వెలిగొండ, భూదాన్ పోచంపల్లి మండలాలున్నాయి. 2018 నాటికి ఓటర్ల సంఖ్య 1,86,607. 2018 ఎన్నికల్లో 90.77 శాతం పోలింగ్ నమోదైంది. ప్రస్తుతం భువనగిరిలో 2,11, 416 మంది ఓటర్లు ఉన్నారు. అందులో మహిళా ఓటర్లు స్వల్పంగా ఎక్కువగా ఉన్నారు. పురుష ఓటర్లు 1,05,404 మంది, మహిళా ఓటర్లు 1,05,958 , సర్వీస్ ఓటర్లు 54 మంది. భువనగిరిలో 2018 ఎన్నికల కంటే ఇప్పుడు 24, 809 ఓట్లు అధికంగా ఉన్నాయి.
భువనగిరి నియోజకవర్గంలో ఎస్సీ, గౌడ సామాజికవర్గాల ఓట్లు ఎక్కువగా ఉన్నాయి. ఆ తర్వాత యాదవలు, రెడ్లు, ముదిరాజ్ లు, పద్మశాలీల ప్రాబల్యం ఎక్కువ. ఎస్సీలు 20 శాతం, గౌడ్స్ 13 శాతం, యాదవలు 10 శాతం, రెడ్లు 10 శాతం, ముదిరాజ్ లు 8 శాతం, పద్మశాలీలు 8 శాతం ఉన్నారు.