Telangana Elections 2023 : తెలంగాణలో వైఎస్సార్ టీపీ అన్ని నియోజకవర్గాల్లో సింగిల్ గా పోటీ చేస్తుందని ఆ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల స్పష్టం చేశారు. రాష్ట్రంలో మొత్తం 119 నియోజకవర్గాల్లో వైఎస్సార్టీపీ అభ్యర్థులు పోటీ చేయనున్నారు. గురువారం మధ్యాహ్నం జరిగిన పార్టీ రాష్ట్ర స్థాయి కార్యవర్గ సమావేశంలో షర్మిల ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.
తెలంగాణ నుంచి వైఎస్ కుటుంబసభ్యులు పోటీ చేయబోతున్నారు. ఖమ్మం జిల్లా పాలేరు నుంచి తాను బరిలోకి దిగుతానని షర్మిల స్పష్టం చేశారు. మిర్యాలగూడ నుంచి ఆమె తల్లి విజయమ్మ, సికింద్రాబాద్ నుంచి బ్రదర్ అనిల్కుమార్ పోటీ చేయొచ్చని తెలుస్తోంది. కార్యకర్తల నుంచి డిమాండ్ ఉందని, అవసరమైతే వాళ్లిద్దరూ పోటీ చేస్తారని షర్మిల క్లారిటీ ఇచ్చేశారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదనే తాను కాంగ్రెస్తో నాలుగు నెలల పాటు చర్చలు జరిపానని పార్టీ కార్యవర్గ సమావేశంలో చెప్పారు. రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో వైఎస్సార్టీపీ పోటీ చేస్తుందని నాయకులకు క్లారిటీ ఇచ్చారు. వైఎస్సార్టీపీ నుంచి టికెట్ కోసం ఆశావహులు అప్లై చేసుకోవచ్చన్నారు.
కాగా.. వైఎస్సార్ టీపీ ఏ పార్టీకి బీ-టీమ్ కాదని షర్మిల తెలిపారు. రెండురోజుల్లోనే పార్టీ మేనిఫెస్టో ప్రకటించనున్నారు. అలాగే ఎన్నికల్లో పోటీ చేసేందుకు రైతు, నాగలి గుర్తుకోసం ఇప్పటికే అప్లై చేసుకున్నారు. కాంగ్రెస్ తో కలిసి వైఎస్సార్టీపీ పోటీ చేస్తుందని అనుకుంటున్న సమయంలో.. సింగిల్ గా ఎన్నికల బరిలోకి దిగుతున్నట్లు వైఎస్ షర్మిల ప్రకటించడంతో తెలంగాణలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందో చెప్పడం కష్టమేనని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.