హైదరాబాద్లో యువతి అనుమానాస్పద మృతి కలకలం రేపుతోంది. మాదాపూర్లో ఉన్న ఓయో హోటల్ లో గదిలో పుదుచ్చేరికి చెందిన శర్వణ ప్రియ అనుమానాస్పద స్థితిలో మరణించింది. ఓ ఫార్మసీలో పని చేస్తున్న శర్వణ ప్రియ (25).. చెన్నైకి చెందిన వ్యాపారవేత్త శ్రీహరి రమేష్(25) ను కలవడానికి ఓయో రూంకి వెళ్లిన సమయంలో మృతి చెందింది. దీంతో ఓయో నిర్వాహకులపై విమర్శలు వెల్లువెత్తున్నాయి.
హైదరాబాద్ నగరంలో ఓయో రూంలు కోకొల్లు. ఇప్పటికే ఓయోలో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతాయంటూ జోరుగా విమర్శలు వెల్లువెత్తుతున్న తరుణంలో యువతి అనుమానాస్పద మృతితో ప్రజలు మరింత మండిపడుతున్నారు. ఎవరికి పడితే వారికి, ఎలాంటి చెకింగ్లు లేకుండా ఓయోలు నిర్వహిస్తుండటంతోనే దారుణ ఘటనలు చోటు చేసుకుంటున్నాయని ఫైర్ అవుతున్నారు.
ఎస్ఐ వెంకటేశ్వర్లు తెలిపిన వివరాల మేరకు.. శర్వణ ప్రియ, శ్రీహరి రమేశ్ లకు కాలేజీలో చదువుకున్న సమయం నుంచే స్నేహితులుగా ఉన్నారు. వీరిద్దరూ మాదాపూర్ చందానాయక్ తాండలో గోల్డెన్ హైవ్ ఓయోలో 308 రూమ్ ను బుక్ చేసుకున్నారు. రాత్రి 9 గంటల సమయంలో ఇద్దరూ కలిసి మద్యం తాగారు. తెల్లవారుజామున శ్రీహరికి వాంతులు కావడంతో ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందాడు. అనంతరం ఓయో హోటల్ లో రూమ్ కు వచ్చిన అతనికి శర్వణ ప్రియ కుర్చీలో ఎలాంటి కదలిక లేకుండా కూర్చుని కనిపించడంతో షాకయ్యాడు.
వెంటనే అంబులెన్స్ కు ఫోన్ చేసి.. హోటల్ సహాయక సిబ్బంది సహాయంతో ఆమెను అంబులెన్స్ లోకి తీసుకెళ్లగా.. అప్పటికీ ఆమె మరణించినట్లు అంబులెన్స్ సిబ్బంది నిర్థారించారు. వెంటనే పోలీసులకు సమాచారమివ్వగా.. పోలీసులు అక్కడికి చేరుకుని ఆ రూమ్ ను తమ ఆధీనంలోకి తీసుకున్నారు. శర్వణ తల్లిదండ్రులకు సమాచారమిచ్చి.. మృతదేహాన్ని పోస్టుమార్టమ్ నిమిత్తం ఉస్మానియాకు తరలించారు.