Shabarimala: ఏటా లక్షలాది మంది అయ్యప్పమాల వేసుకుని, నల్లని వస్త్రాలను ధరించి, మద్యమాంసాలకు, లౌకిక విషయాలకు దూరంగా ఉంటూ 41 రోజులపాటు దీక్షను కొనసాగిస్తుంటారు. దీక్షకు ముగింపు సందర్భంగా శబరిగిరిపై కొలువైన హరిహరసుతుడిని దర్శించుకునే క్రమంలో భక్తులంతా అక్కడి 18 ఆలయపు మెట్లు ఎక్కి స్వామి చెంతకు చేరతారు. అయితే.. ఈ 18 మెట్లు ముక్తిసోపానాలనీ, వాటికి ఎంతో ప్రాముఖ్యత ఉందనీ పెద్దలు చెబుతారు. ఆ విశేషాలు..
ఒకటి నుంచి ఐదు మెట్లను పంచేద్రియాలుగా చెబుతారు. వీటిలో మొదటిమెట్టును చెవులకు, రెండవది కన్నులకు, మూడవది చర్మానికి, నాల్గవది ముక్కుకు, ఐదవది నాలుకకు ప్రతీక. మనిషి ఈ ఐదింటిపై నియంత్రణ సాధిస్తే.. ఆధ్యాత్మిక లక్ష్యసాధన సులువవుతుంది.
ఇక.. ఆరవ మెట్టు కామానికి, ఏడో మెట్టు క్రోధానికి, ఎనిమిదో మెట్టు లోభానికి, తొమ్మిదో మెట్టు మోహానికి, పదో మెట్టు మదానికి ప్రతీకలు కాగా.. పదకొండో మొట్టు మాత్సర్యానికి, పన్నెండో మెట్టు అహంకారానికి, పదమూడో మెట్టు తత్వ నియంత్రణకు సూచికలు. మనిషిని పతనం వైపు నడిపించే ఈ 8 అంశాలను మనిషి అధిగమిస్తే.. పరమాత్మ తత్వాన్ని గ్రహించటం సులభమవుతుంది.
ఆ తర్వాత వచ్చే.. పద్నాలుగో మెట్టు సత్వగుణానికి, పదిహేనో మెట్టు రజోగుణానికి, పదహారో మెట్టు తమోగుణానికి ప్రతీకలు. వీటిపై నియంత్రణ సాధించగలిగితే.. మనిషి తన జీవన పరమార్థమేమిటో గ్రహించగలుగుతాడు.
ఆఖరిగా వచ్చే పదిహేడు.. పద్దెనిమిదో మెట్లు అజ్ఞానానికి, విజయానికి ప్రతీకలు. మనిషిలోని అజ్ఞానపు తెర తొలగిపోగానే.. మనిషి పరమాత్మను దర్శించే ప్రయత్నంలో విజయాన్ని సాధిస్తాడని ఇవి తెలియజేస్తున్నాయి.