Telangana Elections 2023 : బీఆర్ఎస్లో అసమ్మతి జ్వాలలు హై కమాండ్కు తలనొప్పిగా మారాయి. ముచ్చటగా మూడవసారి అధికార పీఠాన్ని కైవసం చేసుకుని హ్యాట్రిక్ కొట్టాలని భావిస్తున్న గులాబీ నేతకు.. సీనియర్ల తిరుగుబాటు, ఆశావహుల అసంతృప్తులు గుబులు పుట్టిస్తున్నాయి. ఇప్పటికే పలువురు నేతలు గులాబీ గూటిని వదిలి కాషాయం, హస్తం కండువాలు కప్పుకోగా.. కేసీఆర్పై అలకబూనిన మరికొందరు నేతలు అదే బాట పట్టేందుకు సిద్ధమవుతున్నారు.
ఎలక్షన్ షెడ్యూల్తో ఎన్నికల హీట్ మరింత పెరిగింది. హ్యాట్రిక్ దిశగా బీఆర్ఎస్ వ్యూహాలు రచిస్తోంటే.. పూర్వవైభవాన్ని నెలకొల్పేందుకు హస్తం ఎత్తుగడలు వేస్తోంది. ఇక ఎలాగైనా తెలంగాణలో కాషాయ జెండా పాతాలన్న కుతూహలంతో కమలనాథులు పోటీకి సై అనడంతో రాష్ట్రంలో త్రిముఖ పోటీ నెలకొంది. ఇలాంటి పరిస్థితుల్లో గులాబీ పార్టీలో అసంతృప్తుల జ్వాలలు ఎగసిపడుతుండటంతో బీఆర్ఎస్లో ప్రకంపనలు కొనసాగుతున్నాయి.
ఇక తాజాగా మందా జగన్నాథం, మాజీ ఎంపీ సీతారామంనాయక్లు కేసీఆర్పై తిరుగుబాటు బావుట ఎగురవేస్తుండటం రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. తెలంగాణ కోసం పిడికిలి బిగించి ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన తమను విస్మరిస్తున్నారని కేసీఆర్పై తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు నేతలు. చీమలు పెట్టిన పుట్టల్లో పాములు వచ్చి చేరి..పుట్టనే ఆక్రమిస్తున్నారంటూ ధ్వజమెత్తారు. మరోపక్క అలంపూర్లో అభ్యర్థిని మార్చకపోతే బీఆర్ఎస్ ఓటమి ఖాయమంటున్నారు మందా జగన్నాథం. ఉన్నత చదువులను త్యాగం చేసి పార్టీ కోసం కష్టపడ్డ తమ కుమారుడు శ్రీనాథ్కు టికెట్ కేటాయించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక మాజీ ఎంపీ సీతారామ్నాయక్ కూడా ఇదే తరహాలో గులాబీ బాస్పై విమర్శలు గుప్పిస్తున్నారు. తనకు టికెట్ కేటాయించకపోవడంపై కన్నెర్ర చేస్తున్నారు. ఇల్లందు బీఆర్ఎస్ లోనూ అసంతృప్తి రాగం పెరుగుతోంది. తాజాగా ఇల్లందు బీఆర్ఎస్ నేతలు మంత్రి కేటీఆర్ తో సమావేశమయ్యారు. ఇల్లందు బీఆర్ఎస్ అభ్యర్థిని మార్చాలని డిమాండ్ చేస్తున్నారు.