Varadharaja Perumal Temple : ఎంతో కష్టపడి, బండ చాకిరి చేసినా.. చివరకు ఆ పని వల్ల ఏ ప్రయోజనమూ లేకుండా పోయినప్పడు…‘అయ్యో.. నా కష్టమంతా కంచి గరుడ సేవ అయిందే’ అని అనుకోవటం మనకు తెలిసిందే. ఆ మాట ఎలా వచ్చిందో తెలుసుకుందాం.
శ్రీ మహావిష్ణువుకు అత్యంత ఇష్టమైన వాహనం.. గరుత్మంతుడు. ఈయననే వైనతేయుడు అనీ అంటారు. అత్యంత సూక్ష్మ దృష్టికి, అరివీర పరాక్రమానికి, అనితరమైన స్వామిభక్తికి వైనతేయుడు గొప్ప ఉదాహరణ. విష్ణుమూర్తి మనసులో ఎక్కడికైనా బయలుదేరాలని అనుకోగానే.. వైనతేయుడు సిద్ధమైపోతాడట.
తిరుమల బ్రహ్మోత్సవాల్లోనూ గరుడవాహన సేవను చూసి తరించాలని లక్షలాది జనం తిరుమల కొండకు రావటం తెలిసిందే.
ఇక.. ‘కంచి గరుడసేవ’ అనే విషయానికొస్తే.. శ్రీమహావిష్ణువు నెలవైన 108 ప్రధాన క్షేత్రాల్లో కంచి కూడా ఒకటి. అక్కడ వరదరాజ పెరుమాళ్ పేరుతో విష్ణువు దర్శనమిస్తారు.
అయితే.. అక్కడి ఆలయ సేవల్లో భాగంగా స్వామివారి ఉత్సవ విగ్రహాన్ని ఇత్తడితో చేసిన భారీ గరుడవాహనంపై స్వామి ఊరేగిస్తారు. అయితే.. అక్కడి స్వామి వారి ఉత్సవ విగ్రహం మాత్రం గరుత్మంతుడి విగ్రహం సైజు కంటే చాలా చిన్నదిగా ఉంటుంది.
కానీ.. స్వామిని ఊరేగించాల్సిన ప్రతిసారీ.. ఆ భారీ ఇత్తడి గరుత్మంతుడి విగ్రహాన్ని తీసి, కొబ్బరి పీచుతో రెక్కలు అరిగి పోయేలా రుద్ది తళతళ మెరిసేలా చేయాల్సిన పని అక్కడి పూజారులదే.
అలా.. ప్రతి పండుగకూ ఆ గరుత్మంతుడి విగ్రహాన్ని అతికష్టం మీద బయటకు తీసుకురావటం, దానిని రుద్ది కడిగే క్రమంలో వారికి చేతులునొప్పి పుట్టి.. వారంతా ‘ వరాలిచ్చే స్వామి వారినేమో గంటలో సిద్ధం చేయగలుగుతున్నాం. కానీ.. ఈ గరుత్మంతుడి కోసమేమో రోజుల తరబడి ఒళ్లు హూనం చేసుకుంటే గానీ పని జరగదు. ఇంత చేసినా.. ఈయన ఒక్క వరమూ ఇవ్వడు. కానీ.. స్వామి ఊరేగింపు ఈయన లేకుండా జరగదు. మనకీ చాకిరీ తప్పదు. మన కష్టమంతా కంచి గరుడ సేవే. ఇదేదో స్వామివారి సేవైనా చేసుకుంటే.. కాస్త పుణ్యం, పురుషార్థమైనా వస్తుంది’ అని విసుక్కునే వారట. వందల ఏళ్లనాటి ఈ ముచ్చట వారి కష్టం ఆనోటా ఈనోటా పడి.. ‘కంచి గరుడ సేవ’గా విరివిగా వాడుకలోకి వచ్చింది. కానీ.. నేటికీ స్వామి అదే వాహనం మీద శతాబ్దాలుగా అలాగే ఊరేగుతూనే ఉన్నారు.