Lokesh – Amit Shah Meet : టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్(Nara Lokesh).. కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Amit Shah)ను కలిశారు. తన తండ్రితోపాటు మొత్తం కుటుంబ సభ్యులను తప్పుడు కేసులతో వేధిస్తూ.. సీఎం జగన్ (CM Jagan) కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నట్లు ఆయన దృష్టికి తీసుకెళ్లారు. ఇన్నర్ రింగ్ రోడ్డు కేసు (Inner Ring Road Case)లో రెండు రోజుల సీఐడీ విచారణ ముగిసిన అనంతరం బుధవారం సాయంత్రం ఢిల్లీకి వెళ్లారు లోకేష్. రాత్రి అమిత్షాతో ఆయన నివాసంలో సుమారు అరగంటపాటు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఏపీ బీజేపీ చీఫ్ పురందేశ్వరితో పాటు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి(Kishan Reddy) కూడా ఉన్నారు.
స్కిల్ డెవల్పమెంట్ కేసు (Skill Developement Scam Case) లో చంద్రబాబు అరెస్ట్ తీరు, ఆయన జైలు నుంచి బయటికి రాకుండా వరుసగా వేర్వేరు కేసులు పెట్టారని, తనను విచారణ పేరిట ఇబ్బందులకు గురి చేస్తున్నారని లోకేష్ అమిత్ షా దృష్టికి తీసుకెళ్లారు. చివరికి.. తన తల్లినీ, భార్యను కూడా ఇబ్బంది పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని తెలిపారు. విజయవాడ ఏసీబీ కోర్టు నుంచి ఢిల్లీలో సుప్రీంకోర్టు దాకా తాము న్యాయ పోరాటం చేస్తున్నామని వివరించారు. జగన్ అధికారంలోకి వచ్చిన రోజు నుంచే రాష్ట్రంలో ఆటవిక పరిస్థితి నెలకొందని.. ఇప్పుడది పరాకాష్ఠకు చేరిందన్నారు లోకేష్.
చంద్రబాబుపై ఎన్ని కేసులు పెట్టారు ? మీపై ఎన్ని కేసులు పెట్టారు ? అని లోకేష్ను అడిగారు అమిత్ షా. చంద్రబాబు ఆరోగ్యం (Chandrababu Health) పై కూడా కేంద్ర హోంమంత్రి ఆరా తీశారు. ఏపీలో జరుగుతోన్న పరిణామాలను తాను గమనిస్తున్నట్లు చెప్పారు.
అమిత్షాతో లోకేష్ భేటీపై ట్వీట్ చేశారు ఏపీ బీజేపీ చీఫ్ పురందేశ్వరి. రాష్ట్ర ప్రభుత్వ కక్ష సాధింపు గురించి అమిత్షాకు లోకేశ్ వివరంగా చెప్పారని.. చంద్రబాబు అరెస్టు వెనుక బీజేపీ ఉందనే వాళ్లు ఇప్పుడు చెప్పండి.. మీరంటున్నది నిజమైతే లోకేశ్కు అమిత్షా అపాయింట్మెంట్ ఇస్తారా అని ట్విట్టర్ వేదికగా ప్రశ్నించారు పురందేశ్వరి.