Assembly Elections 2023 : చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ ఇటీవల ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల తేదీలను ప్రకటించిన విషయం తెలిసిందే. మిజోరాం, రాజస్థాన్, మధ్యప్రదేశ్, చత్తీస్ గఢ్, తెలంగాణ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల నిర్వహణ, కౌంటింగ్ తేదీలను ప్రకటించారు. పోలింగ్ తేదీలు ప్రకటించిన రెండు రోజులకే ఒక రాష్ట్రంలో పోలింగ్ తేదీని మార్చుతూ నేడు మరో ప్రకటన చేసింది ఈసీ.
రాజస్థాన్ లో పోలింగ్ నిర్వహించే తేదీలో (Rajastan Polling Day) మార్పు జరిగింది. సోమవారం ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం నవంబర్ 23వ తేదీన రాజస్థాన్ లో ఎన్నికలు జరగాల్సి ఉంది. కానీ ఆ రోజు రాష్ట్రంలో భారీగా పెళ్లిళ్లు ఉండడంతో పోలింగ్ తేదీలో మార్పు చేసింది ఈసీ. రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలను నవంబర్ 25వ తేదీకి వాయిదా వేసింది.
రాజస్థాన్ లో నవంబర్ 23న సుమారు 50 వేలకు పైగా పెళ్లిళ్లు జరగనున్నాయట. అదేరోజు ఎన్నికలు నిర్వహించేందుకు ఈసీ సన్నద్ధమైంది. కానీ.. భారీగా పెళ్లిళ్లు జరగనున్న నేపథ్యంలో ఓటింగ్ శాతం తగ్గే అవకాశాలున్నాయని, పోలింగ్ తేదీని మార్చాలంటూ రాజస్థాన్ బీజేపీ ఈసీని ఆశ్రయించింది. ఓటింగ్ శాతం తగ్గుతుందన్న అంశాన్ని పరిగణలోకి తీసుకున్న ఈసీ.. ఈ మేరకు నవంబర్ 25న పోలింగ్ చేపట్టేలా షెడ్యూల్ లో మార్పు చేసింది. డిసెంబర్ 3న యథావిధంగా కౌంటింగ్ ఉంటుందని తెలిపింది.