IT Raids : టాలీవుడ్ నిర్మాత అభిషేక్ అగర్వాల్ (producer abhishek agarwal) నివాసంలో ఐటీ అధికారుల సోదాలు కొనసాగుతున్నాయి. జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 76లోని ఆయన నివాసంలో ఉదయం 8 గంటల నుంచి ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. గత 5 ఏళ్ల కాలంలో ఆయన నిర్మించిన సినిమాలు, వాటి పెట్టుబడులు.. వాటిపై వచ్చిన లాభాలకు సంబంధించి ఆరా తీస్తున్నారు. ప్రస్తుతం అభిషేక్ అగర్వాల్ మాస్ మహారాజ్ రవితేజ హీరోగా టైగర్ నాగేశ్వరరావు (Tiger Nageswara Rao) సినిమాను నిర్మిస్తున్నారు.
టైగర్ నాగేశ్వరరావు సినిమాలో రవితేజ కరుడుగట్టిన గజదొంగ పాత్రలో కనిపించనుండగా.. జాన్ అబ్రహం, గాయత్రి భరద్వాజ్, నూపూర్ సనన్, రేణుదేశాయ్, జిషు సెంగుప్త తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాతో రవితేజ తొలిసారి పాన్ ఇండియా మార్కెట్లో అడుగు పెడుతున్నాడు. భారీ బడ్జెట్ తో నిర్మిస్తోన్న ఈ సినిమా ఈ నెల 20వ తేదీన దసరా కానుకగా విడుదల కాబోతోంది. 10 రోజుల్లో సినిమా విడుదల ఉండగా.. నిర్మాత ఇంటిపై దాడులు జరగడంతో చిత్రయూనిట్ కంగారు పడుతోంది. అభిషేక్ అగర్వాల్ ఇప్పటి వరకూ ది కాశ్మీర్ ఫైల్స్, కార్తికేయ 2 వంటి పాన్ ఇండియా చిత్రాలను నిర్మించారు.