Hindu Dharmam : భారతీయ కుటుంబ, సామాజిక, ధార్మిక సంప్రదాయాల్లో అనేక ఆచారాలు, సంప్రదాయాలు కనిపిస్తాయి. నిజానికి వీటన్నింటి వెనక ఆరోగ్యపరమైన, ఆధ్యాత్మికమైన కారణాలున్నాయి. అలాంటి కొన్ని ఆచారాలు, వీటి వెనక ఉన్న అంతరార్ధాలు.. మీకోసం..
నదుల్లో నాణేలు వేయడం: పూర్వం రాగి నాణేలు చెలామణిలో ఉండేవి. భక్తులు వీటిని నీటిలో వేయటం వల్ల ఆ నీరు శుద్ధి అయ్యేది. అలాగే.. లక్షలాది మందికి తాగునీరు, సాగునీరు అందిస్తూ.. మనిషి మనుగడకు కీలకవనరుగా ఉన్న నదిని దైవంగా భావించి కృతజ్ఞత తెలుపుకోవాలనే భావనా ఇందులో ఉంది.
ఉపవాసం: ఉపవాసం వల్ల జీర్ణక్రియకు విరామం లభించి, శరీరం కొంత విశ్రాంతి తీసుకుంటుంది. ఆ సమయంలో నీరు అధికంగా తీసుకోవటం వల్ల శరీరంలోని వ్యర్థాలు తొలగిపోతాయి. జీవక్రియలు ఉత్తేజితమూ అవుతాయి.
ఆలయాల్లో గంట మోగించటం: ఆలయంలోని గంట మోగించినప్పుడు.. విడుదలయ్యే ధ్వని తరంగాల మూలంగా మన శరీరంలోని 7 చక్రాలు ఉత్తేజితమై మనసుకు తెలియని ప్రశాంతత కలగటంతో బాటు మనసు దైవంపై కేంద్రీకృతమయ్యే వాతావరణం ఏర్పడుతుంది.
మహిళలు గాజులు ధరించటం: గాజులు.. మణికట్టుపై తరచూ ఒరిపిడిని కలిగించి.. నాడులను చైతన్యపరచటం వల్ల మహిళల్లో రక్త ప్రసరణ, హార్మోన్ల సమతుల్యత బాగుంటాయి. అలాగే.. గర్భిణిలు గాజులు ధరించినప్పుడు.. ఆమె చేయి పొట్టకు తగిలినప్పుడల్లా.. గర్భస్థ శిశువు ఆ శబ్దాలకు స్పందిస్తుందనీ, ఇది బిడ్డ చైతన్యంగా ఉండేందుకు దోహదపడుతుందని చెబుతారు.
పిల్లలకు చెవులు కుట్టించటం: చిన్నారులకు చెవులు కుట్టించడం వల్ల శ్రవణ నాడి ఉత్తేజితమై వినికిడి సామర్థ్యం మెరుగుపడుతుంది. చెవి భాగం నుంచి మెడదు వరకు ఉండే నాడి ఒకటి చెవి కుట్టటం వల్ల ఉత్తేజిమై మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది.
రావి చెట్టును పూజించడం: బోలెడంత ప్రాణవాయువును విడుదలచేసే ఈ చెట్టు చుట్టూ ప్రదక్షిణల పేరుతో తిరగటం వల్ల శ్వాస వ్యవస్థ బలపడుతుంది. భోధి వృక్షం అని కూడా పిలుస్తారు. ఈ చెట్టు నుంచి వీచే గాలికి అనేక బ్యాక్టీరియాలను నాశనం చేసే శక్తి ఉంటుంది.
మెట్టెలు ధరించడం: వివాహితులైన మహిళలు కాలి రెండవ వేలికి వెండి మెట్టెలు పెట్టుకోవటం వల్ల వేలి భాగంలో ఆక్యుప్రెషర్ ప్రక్రియ జరిగి, రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. అలాగే సంతానోత్పత్తి, సుఖప్రసవం కావటానికి దోహదపడే వేలి నాడులు ఉత్తేజితమవుతాయి.
బొట్టు పెట్టుకోవటం: కనుబొమల మధ్య ఆజ్ఞా చక్రం ఉంటుంది. రోజూ బొట్టు పెట్టుకొనే సమయంలో దానిపై ఒత్తిడి కలిగించటం వల్ల అది శరీరంలోని మిగిలిన ఆరుచక్రాలను ప్రభావితం చేసి శరీరం చైతన్యంగా ఉండేలా చూస్తుంది.
నమస్కరించటం: రెండు చేతులు కలిసి.. హృదయానికి ఆనించి నమస్కరించటం వల్ల చేతి వేళ్ల మధ్య ఆక్యుప్రెషర్ ప్రక్రియ జరిగి నాడులు ఉత్తేజితమవుతాయి. అలాగే.. ఎదుటి వ్యక్తిని హృదయపూర్వకంగా స్వాగతిస్తున్నామనే భావన స్పష్టంగా తెలుస్తుంది. దీనివల్ల మనసు సంతోషానికి లోనవుతుంది.
కింద కూర్చుని భోజనం చేయడం: నేలపై కూర్చుని భోజనం చేయడం వల్ల పద్మాసనం భంగిమ వస్తుంది. దీంతో జీర్ణక్రియ సక్రమంగా జరిగి జీర్ణాశయ సంబంధ సమస్యలు దూరమవుతాయట.
భోజనం తర్వాత తీపి తినటం: భోజనం చేసినప్పుడు ముందుగా కారంగా ఉండే ఆహారం తినడం వల్ల జీర్ణాశయంలో జీర్ణక్రియకు అవసరమైన ఆమ్లాలు బాగా ఉత్పత్తి అవుతాయట. దీంతో జీర్ణక్రియ సక్రమంగా జరుగుతుందట. అయితే భోజనం మొదట్లోనే స్వీట్లు తింటే అది మనం తిన్న ఆహారాన్ని సరిగ్గా జీర్ణంచేయనీయదట.