Nara Chandrababu Naidu : ఏపీ హైకోర్టులో చంద్రబాబుకి స్వల్ప ఊరట లభించింది. ఇన్నర్ రింగురోడ్డు కేసు (Inner Ring Road Scam) లో సోమవారం (అక్టోబర్16) వరకు.. అంగళ్లు కేసులో రేపటి (అక్టోబర్12) వరకూ చంద్రబాబును అరెస్ట్ చేయొద్దని పేర్కొంటూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ముందస్తు బెయిల్ పిటిషన్ పై విచారణ జరిపిన హైకోర్టు ఈ కీలక ఆదేశాలు జారీ చేసింది. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు, అంగళ్లు -అల్లర్లు కేసుల్లో టీడీపీ అధినేత చంద్రబాబు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్లపై హైకోర్టులో బుధవారం విచారణ జరిగింది.
ఈ రెండు కేసుల్లోనూ చంద్రబాబును అరెస్ట్ చేయకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని ఆయన తరపు న్యాయవాది దమ్మాలపాటి శ్రీనివాస్ న్యాయస్థానాన్ని కోరారు. ఈ రెండు కేసుల్లో విచారణకు సహకరిస్తామని న్యాయస్థానికి తెలిపారు. అయితే ఈ విషయంపై సీఐడీ, హోంశాఖతో మాట్లాడి తుదినిర్ణయం చెప్పాలని ప్రభుత్వ న్యాయవాదులకు కోర్టు సూచించింది. ఏసీబీ కోర్టులో ప్రస్తుతం పీటీ వారెంట్ పెండింగ్ లో ఉందని, ఈ దశలో చంద్రబాబుకు బెయిల్ ఇవ్వొద్దని ఏజీ శ్రీరామ్ కోర్టును కోరారు.
ఇరువైపులా వాదనలు విన్న న్యాయస్థానం.. రెండు కేసుల్లోనూ చంద్రబాబును ఇప్పుడు అరెస్ట్ చేయవద్దని పేర్కొంటూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఏసీబీ కోర్టులో సీఐడీ దాఖలు చేసిన పీటీ వారెంట్లను నిలిపివేస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. అలాగే ఇన్నర్ రింగ్ కేసులో పీటీ వారెంట్ పై హైకోర్టు స్టే ఇచ్చింది.