Children in Disaster : ప్రకృతి వైపరీత్యాలు చిన్నారుల పాలిట శాపంలా మారాయి. తుఫాన్లు, వరదలు, కార్చిచ్చు వంటి విపత్తులతో వారికి స్థానచలనం తప్పడం లేదు. యునిసెఫ్ లెక్కల మేరకు 2016-21 మధ్య 43.1 మిలియన్ల మంది పిల్లలు నిరాశ్రయులయ్యారు.
వాతావరణ మార్పుల కారణంగా ఇలా బాధితులయ్యే చిన్నారుల సంఖ్య వచ్చే మూడు దశాబ్దాల్లో 113 మిలియన్లకు చేరుతుందని అంచనా. ప్రకృతి ప్రకోపం కారణంగా ఫిలిప్పీన్స్లో అత్యధిక సంఖ్యలో చిన్నారులు సొంతూరును వదిలేయాల్సి వచ్చింది.
ఇలా దాదాపు 10 మిలియన్ల మంది వలస బాట పట్టారు. భారత్ రెండో స్థానంలో నిలిచింది. 6.7 మిలియన్ల మంది చిన్నారులు నిరాశ్రయులయ్యారు. 6.4 మిలియన్ల మందితో చైనా మూడో స్థానాన్ని ఆక్రమించింది. ప్రపంచవ్యాప్తంగా చిన్నారులు నిరాశ్రయులు కావడానికి ప్రధాన కారణం తుఫాన్లు, వరదలు.
ఫలితంగా ఆ ఆరేళ్ల కాలంలో దాదాపు 21.1 మిలియన్ల మంది ఆశ్రయం కోల్పోయారు.
ఇక అమెరికాలో ప్రధానంగా తుఫాన్లు, ఆ తర్వాత కార్చిచ్చుల వల్ల పిల్లలు నిలువనీడను కోల్పోతున్నారు. అలా అగ్రరాజ్యంలో 1.7 మిలియన్ల మంది నిరాశ్రయులయ్యారు.
చైనాలో 6.4 మిలియన్ల మంది, సోమాలియాలో 1.7, ఇథియోపియా 1.3, ఇండొనేసియాలో 1 మిలియన్ మంది చిన్నారులకు ఆశ్రయం కరువైంది. ప్రకృతి వైపరీత్యాలతో కుటుంబాలు కకావికలమై.. సర్వం కోల్పోతున్న పిల్లలు దోపిడీ, లైంగిక దాష్టీకాలకు గురవుతున్నారు.