Nara Lokesh : ఇన్నర్ రింగ్ రోడ్డు కేసు(Inner Ring Road Case)లో నారా లోకేష్ రెండో రోజు సీఐడీ విచారణకు హాజరయ్యారు. మంగళవారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు లోకేష్ను విచారించిన సీఐడీ అధికారులు..బుధవారం మరోసారి విచారణకు రావాలని అక్కడే నోటీసులు ఇచ్చారు. అయితే.. బుధవారం వివిధ పనుల్లో తాను బిజీగా ఉంటానని..ఏవైనా ప్రశ్నలుంటే ఎంత సమయమైనా..ఇప్పుడే అడగాలని సీఐడీ అధికారులకు చెప్పినట్లు లోకేష్ తెలిపారు. అయినప్పటికీ బుధవారం విచారణకు రావాలని నోటీసులు జారీ చేశారని వెల్లడించారు.
అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్ మెంట్ మార్పులో భారీ అక్రమాలు జరిగాయని ఏపీ ప్రభుత్వం ఆరోపిస్తుంది. ఈ కేసులో చంద్రబాబుతో పాటు నారా లోకేష్ ను కూడా సీఐడీ నిందితులుగా చేర్చింది. ఇన్నర్ రింగ్రోడ్డు కేసులో లోకేష్ ను A14 గా చేర్చుతూ.. గత నెల 30న 41A కింద నోటీసులు జారీ చేస్తూ విచారణకు రావాలని పేర్కొంది సీఐడీ.
అయితే నిన్న సీఐడీ విచారణ నుంచి బయటకు వచ్చిన లోకేష్.. ఇన్నర్ రింగ్ రోడ్డుతో సంబంధం లేని అనేక ప్రశ్నలు అడిగారని తెలిపారు. ఇన్నర్ రింగ్ రోడ్డుకు సంబంధించి ఎలాంటి ఆధారాలు తన ముందు పెట్టలేదన్నారు. విచారణలో సీఐడీ అధికారులు తనను 50 ప్రశ్నలు అడిగారని చెప్పుకొచ్చారు. లేని ఇన్నర్ రింగ్ రోడ్డు విషయంలో తాను, తన కుటుంబసభ్యులు ఎలా లాభపడ్డారో ఒక్క ప్రశ్న కూడా వేయలేదని లోకేష్ పేర్కొన్నారు. ఇది కక్షసాధింపు తప్ప ఎలాంటి ఆధారాలు లేని కేసని.. వైసీపీ ప్రభుత్వం దొంగ ఎఫ్ఐఆర్లు నమోదు చేస్తోందని ఆరోపించారు.