YSR Sampoorna Poshana Kit: అంగన్వాడీ కేంద్రాల ద్వారా గర్భిణులకు పంపిణీ చేసే వైయస్సార్ సంపూర్ణ పోషణ కిట్ లో పాము కళేబరం కనిపించింది. ఈ ఘటన చిత్తూరు జిల్లాలో కలకలం రేపింది. బంగారుపాళ్యం మండలం జంబువారిపల్లె పంచాయతీ శాంతినగర్ అంగన్ వాడీ కేంద్రంలో ఈ ఘటన వెలుగుచూసింది.
మానస అనే గర్భిణి..అంగన్వాడీ కేంద్రంలో ఇచ్చిన వైయస్సార్ సంపూర్ణ పోషణ కిట్ తీసుకుని ఇంటికి వెళ్లిపోయింది. ఆ తర్వాత కిట్లో ఉన్న ఖర్జూరాల ప్యాకెట్ విప్పి చూడగా అందులో పాము కళేబరం కనిపించింది. అవాక్కైన మానస అంగన్వాడీ సూపర్వైజర్ రెడ్డి కల్యాణికు విషయం చెప్పారు. సూపర్ వైజర్ సీడీపీఓ వాణిశ్రీదేవికి సమాచారం ఇచ్చింది. గర్భిణికి ఇచ్చిన కిట్ లో ఉన్న ఖర్జూరం ప్యాకెట్ లో పాముకళేబరం ఉన్నమాట వాస్తమేనని వాణిశ్రీదేవి తెలిపారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లామని, బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్నారు. మానసకు మరో ప్యాకెట్ ఇవ్వాల్సిందిగా గుత్తేదారును ఆదేశించినట్లు సీడీపీఓ పేర్కొన్నారు.
కాగా.. ప్రభుత్వం అందించే కిట్ లో పాము కళేబరం ఉన్న విషయం తెలిసిన స్థానికులు కాంట్రాక్టర్ నిర్లక్ష్యంపై మండిపడుతున్నారు. పౌష్టికాహారం విషయంలో ఇంత అశ్రద్ధగా ఉంటే.. బాలింతలు, చిన్నారులు, గర్బిణుల పరిస్థితి ఏమిటని ప్రశ్నిస్తున్నారు.