Amit Shah : తెలంగాణ ప్రజల కోసం కేసీఆర్ ఏం చేయలేదని కేంద్రమంత్రి అమిత్ షా అన్నారు.కేటీఆర్ని సీఎంని ఎలా చేయాలా అనే పదేళ్లు గా ఆలోచిస్తున్నారని మండిపడ్డారు. ఆదిలాబాద్ లో బీజేపీ నిర్వహించిన జనగర్జన సభ(Adilabad Janagarjana Sabha)కు హాజరైన అమిత్ షా.. తెలంగాణలో బీజేపీ రాజ్యం తీసుకురావాలని పిలుపునిచ్చారు. కుమురం భీం ను స్మరించుకుంటూ ప్రసంగం మొదలు పెట్టిన అమిత్ షా.. ఇలాంటి పవిత్రమైన భూమి ఆదిలాబాద్ కు రావడం ఎంతో సంతోషంగా ఉందన్నారు.
తెలంగాణలో వచ్చేది డబుల్ ఇంజిన్ సర్కారేనని.. డిసెంబర్ 3న హైదరాబాద్ లో బీజేపీ జెండా ఎగరాలని ప్రజలను కోరారు. కేసీఆర్ వైఖరి కారణంగానే రాష్ట్రంలో గిరిజన వర్సిటీ ఏర్పాటు ఆలస్యమైందని, వర్సిటీ ఏర్పాటుకు స్థలం చూపని కారణంగానే జాప్యం జరిగిందన్నారు. రెండుసార్లు అధికారంలోకి వచ్చిన కేసీఆర్ సర్కార్ రైతులు, దళితులు, గిరిజనులను పట్టించుకోలేదని విమర్శించారు. కానీ మోదీ ప్రభుత్వం చట్ట సభల్లో 33 శాతం రిజర్వేషన్ కల్పించిందని గుర్తుచేశారు.
దేశంలో ప్రతి పేద మహిళకు మోదీ సర్కార్ వంటగ్యాస్ సిలిండర్ అందించి, రైతుల ఖాతాల్లో ప్రతిఏటా రూ.6 వేలు జమ చేస్తున్నామన్నారు. ఎక్కడో ఒడిశాలో పుట్టిన నిరుపేద గిరిజన మహిళను మోదీనే.. రాష్ట్రపతిని చేశారని తెలిపారు. 9 ఏళ్లుగా కేంద్రంలో మోదీ సర్కార్ పేద ప్రజలకోసం ఎన్నో కార్యక్రమాలు చేపట్టిందని వివరించారు. కానీ కేసీఆర్ పేదలకు, గిరిజనులకు ఇచ్చిన ఏ హామీలనూ నెరవేర్చలేదన్నారు. తెలంగాణ అభివృద్ధి దేశానికే ఆదర్శమని, తాము తెలంగాణను నెంబర్ వన్ చేశామని కేసీఆర్ చెబుతుంటారు కానీ.. వాళ్లు రాష్ట్రాన్ని నెంబర్ వన్ స్థానంలో నిలబెట్టింది ఆత్మహత్యలు, అవినీతిలో అని అమిత్ షా విమర్శలు గుప్పించారు. రైతుల ఆత్మహత్యల్లో తెలంగాణ నెంబర్ 1 గా ఉందన్న అమిత్ షా.. కేసీఆర్ కారు స్టీరింగ్ ఓవైసీ చేతిలో ఉందని మరోసారి సెటైర్లు వేశారు.