Chandra Babu Quash Petition : స్కిల్ డెవలప్ మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు దాఖలు చేసిన పిటిషన్ పై నేడు సుప్రీంకోర్టులో వాడి వేడిగా వాదనలు జరిగాయి. సుప్రీంకోర్టు సీనియర్ లాయర్ హరీష్ సాల్వే చంద్రబాబు తరపున వాదిస్తూ.. 17ఏ సెక్షన్ కు సంబంధించిన అంశాలు, వివిధ కేసుల్లో వచ్చిన తీర్పులను ప్రస్తావించారు. వాదనలకు మరో గంట సమయం కోరగా.. మూడు రోజులుగా చంద్రబాబు లాయర్లే వాదిస్తున్నారని సీఐడీ లాయర్ ముఖుల్ రోహత్గీ వాదించారు. చంద్రబాబు అరెస్టుకు సంబంధించి 17A వర్తించదని ముకుల్ రోహత్గీ వాదించారు. అదే సమయంలో.. అవినీతి నిరోధక చట్టం దుర్వినియోగం కాకుండా చూడాలని సాల్వే ధర్మసనాన్ని కోరారు. క్రిమినల్ కేసుల్లో మళ్లీ కౌంటర్ అఫిడవిట్ల అవసరమేంటన్నారు. దానికి కౌంటర్ గా నోటీసులు ఇవ్వడం కోర్టు విధానాల్లో భాగమని రోహత్గీ వాదించారు.
సెక్షన్ 17ఏ పరిధిలో అంశాలను న్యాయవాది హరీష్ సాల్వే కోర్టుకు వివరించారు. ఈ క్రమంలో రఫేల్ కొనుగోళ్లపై యశ్వంత్ సిన్హా వేసిన పిటిషన్, అనంతరం దాఖలైన పలు కేసులపై వచ్చిన తీర్పుల గురించి ప్రస్తావించారు. 2019లో రఫేల్ కొనుగోళ్లపై యశ్వంత్ సిన్హా దాఖలు చేసిన రివ్యూ పిటిషన్లను జస్టిస్ కేఎం జోసెఫ్ కొట్టివేసిన విషయాన్ని సాల్వే గుర్తుచేశారు.రఫేల్ కేసులో ఆరోపణలు 2016కు సంబంధించినవి కాగా.. 2019లో యశ్వంత్ సిన్హా పిటిషన్లపై తీర్పులొచ్చాయని, చట్ట సవరణకు ముందున్న ఆరోపణలను పరిగణనలోకి తీసుకునే 2019లో కేసు కొట్టివేసినట్లు సాల్వే వివరించారు. సెక్షన్ 17ఏ తో అన్నిరకాల విధుల్లోని ప్రభుత్వ అధికారులకు రక్షణ లభించిందని పేర్కొన్నారు.
అనంతరం ముకుల్ రోహిత్గీ వాదనలు వినిపించారు. చంద్రబాబుపై ఉన్న స్కిల్ డెవలప్ మెంట్ కేసును రాజకీయ ప్రతీకార చర్యగా చూడకూడదన్నారు. ఈ కేసులో 2018కి ముందు విచారణ జరిగి నిలిచిపోయిందని, అంతమాత్రాన విచారణ జరగనట్లు కాదని వాదించారు. 2018 మే నెలలో మెమో దాఖలు చేశారని, అందులో తగిన వివరాలున్నాయని తెలిపారు. 400 పేజీలతో కూడిన ఆ వివరాలన్నింటినీ బెంచ్ ముందు ఉంచారు. అవినీతి నిరోధక చట్టం వర్తించనపుడు ఐపీసీ సెక్షన్ 420 కింద కేసును పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు. నేరం ఎప్పుడు జరిగిందో అప్పటి చట్టం ప్రకారమే విచారణ జరపాలని కోరారు. 17ఏ ప్రకారం చంద్రబాబును ప్రిలిమినరీ ఎంక్వైరీ చేయవచ్చని రోహిత్గీ తెలిపారు.
రోహిత్గీ వాదనలపై స్పందించిన బెంచ్.. సెక్షన్ 17ఎ ప్రకారం ఎంక్వయిరీ, ఇంక్వయిరీ, ఇన్వెస్టిగేషన్ దేనికీ అవకాశం లేదని పేర్కొంది. పబ్లిక్ ఇంట్రెస్ట్ తో నిర్ణయాలు తీసుకుని వ్యక్తి ప్రయోజనాలకు అవకాశం కల్పిస్తే దానికి 17ఎ ఎలా వర్తిస్తుందని రోహిత్గీ బెంచ్ ను ప్రశ్నించారు. 17ఏ ను అవినీతిని నిరోధించేందుకు తీసుకొచ్చారని, 17ఏ సవరణ నేరస్థులకు రక్షణ కవచంగా మారకూడదని నిజాయతీపరులైన అధికారులు, ప్రజాప్రతినిధులను అనవసర భయాల నుంచి దూరం చేసేందుకే ఈ సవరణ చేశారని గతంలో ఇచ్చిన తీర్పును గుర్తు చేశారు. ఇరుపక్షాల వాదనలు విన్న సుప్రీం ద్విసభ్య ధర్మాసనం.. తదుపరి విచారణను శుక్రవారం (అక్టోబర్ 13) మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా వేసింది.