NALGONDA : తెలంగాణలోని నల్గొండ.. ఉద్యమాలకు పురిటిగడ్డ. ఎంతో ఘన చరిత్ర ఉన్న ఈ ప్రాంతం అభివృద్ధిలో మాత్రం ఇంకా వెనుకబడే ఉంది. దశాబ్దాలుగా తాగు, సాగునీటి సమస్యలతో సతమతమవుతోంది. ఈ సమస్యలను పరిష్కరించాలన్న లక్ష్యంతో శ్రీశైలం లెఫ్ట్ .. ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్టు నిర్మాణాన్ని ప్రభుత్వం చేపట్టింది. ఈ ప్రాజెక్టులో బ్యాంకు కెనాల్, టన్నెల్ నిర్మాణం కీలకం. కానీ ఈ పనులు మాత్రం నత్తనడకన సాగుతున్నాయి. గ్రామాలకు కనెక్టింగ్ రోడ్ల నిర్మాణం పెండింగ్లోనే ఉంది. రహదారులు సరిగా లేక గ్రామీణ ప్రాంత ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేకపోవడం మరో ప్రధాన సమస్య.
నల్గొండ నియోజకవర్గంలో మౌలిక సదుపాయాలు సరిగా లేవని స్థానికుల నుంచి విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 2018 ఎన్నికల ప్రచార సమయంలో బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసిన కంచర్ల భూపాల్ రెడ్డి అనేక హామీలు ఇచ్చారు. భూగర్భ డ్రైనేజీ, చెక్ డ్యామ్లను నిర్మిస్తామన్నారు. శ్రీశైలం ఎడమ గట్టు కాలువ, పాలగొల్లు రిజర్వాయర్ల పనులు పూర్తి చేస్తామన్నారు. కంచర్ల భూపాల్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలిచినా సరే.. ఈ హామీలేవి నెరవేర్చలేదని స్థానికులు చెబుతున్నారు.
రాజకీయంగానూ ఎంతో కీలకంగా ఉన్న నియోజకవర్గం నల్గొండ.ఇక్కడ 7 సార్లు కాంగ్రెస్ జెండా రెపరెపలాడింది. 3సార్లు టీడీపీ విజయం సాధించింది. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ సైతం ఇక్కడ నుంచి 1985 ఎన్నికల్లో విజయం సాధించడం విశేషం. పీడీఎఫ్, సీపీఐ, సీపీఎం, బీఆర్ఎస్ అభ్యర్థులు ఒక్కొక్కసారి గెలిచారు. ఒకసారి స్వతంత్ర అభ్యర్థిని ప్రజలు గెలిపించారు.
కాంగ్రెస్ కు కంచుకోటగా ఉన్న ఈ నియోజకవర్గంలోకి 2018లో తొలిసారిగా కారు దూసుకొచ్చింది. ఇక్కడ నుంచి కాంగ్రెస్ సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి 1999 నుంచి 2014 వరకు వరుసగా 4సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు.ఈ నియోజకవర్గంలో తన పట్టును పెంచుకున్నారు. అయితే 2018 ఎన్నికల్లో మాత్రం బీఆర్ఎస్ అభ్యర్థి కంచర్ల భూపాల్ రెడ్డి చేతిలో ఓడిపోయారు.
ఈ సెగ్మెంట్ లో నల్గొండ, కనగల్, తిప్పర్తి, మడుగులపల్లి మండలాలున్నాయి. 2018 ఎన్నికల నాటికి 2,21, 836 ఓట్లు ఉన్నాయి. 2018 ఎన్నికల్లో 85.59 శాతం ఓటింగ్ నమోదైంది. ప్రస్తుతం 2,37 ,951 మంది ఓటర్లు ఉన్నారు. అందులో మహిళా ఓటర్ల సంఖ్య ఎక్కువ. పురుష ఓటర్లు 1,16,487, మహిళా ఓటర్లు 1,21,326, ట్రాన్స్ జెండర్స్ 53 మంది, సర్వీస్ ఓటర్లు 85 మంది ఉన్నారు. గత ఎన్నికల కంటే 16,115 ఓట్లు పెరిగాయి.
ఈ నియోజకవర్గంలో ఎస్సీ, గౌడ్ , ముస్లిం, యాదవుల ఓట్లే కీలకం. ఎస్సీలు 20 శాతం, గౌడ్స్ 16 శాతం, ముస్లింలు 15 శాతం, యాదవులు 12 శాతం, రెడ్లు 4 శాతం, ఎస్టీలు 4 శాతం ఉన్నారు.