Appikonda Beach : విశాఖ సముద్ర తీరాల్లో ఎక్కడ చూసినా జంటలు ఎక్కువగా కనిపిస్తుంటారు. కొన్ని బీచ్ ల వద్ద ఉండే రాళ్ల దగ్గర కూర్చుని.. కబుర్లు చెప్పుకుంటూ కాలం గడిపేస్తుంటారు. అలా సరదాగా తన ప్రియుడితో కలిసి గాజువాడ అప్పికొండ బీచ్ కు వచ్చిన ఓ యువతి 12 గంటల పాటు నరకయాతన అనుభవించింది. కాపాడే వారికోసం ఎదురుచూస్తూ.. అరచేతిలో ప్రాణాలు పట్టుకుని అలాగే ఉండిపోయింది. ఇంతకీ ఆ యువతికి ఏమైంది? వివరాల్లోకి వెళ్తే..
భీమవరానికి చెందిన ఒక యువకుడు, మచిలీపట్నానికి చెందిన యువతి వారంరోజుల క్రితం అప్పికొండకు వచ్చారు. పగలంతా విశాఖ నగరంలో తిరుగుతూ.. రాత్రి సమయంలో సముద్రతీరంలోని కొండపైనే ఉంటున్నారు. సోమవారం కూడా అక్కడే ఉన్న యువతి, యువకుడు ఫొటోలు తీసుకుంటుండగా.. యువతి పట్టుతప్పి జారి కిందపడిపోయింది. రాళ్ల మధ్య ఇరుక్కుపోయిన ఆ యువతి స్పృహ కోల్పోయింది. ఆమెతో పాటే ఉన్న యువకుడు.. ఆమెను కాపాడే ప్రయత్నం చేయకపోగా.. అక్కడి నుంచి తనకేం సంబంధం లేదన్నట్లు పరారయ్యాడు.
సుమారు 12 గంటల పాటు రాళ్ల మధ్యే ఇరుక్కుపోయి ఉన్న ఆ యువతిని జాలర్లు గుర్తించారు. అపస్మారక స్థితిలో ఉన్న ఆమెను రాళ్ల మధ్య నుంచి రక్షించి.. డోలీ సహాయంతో ఒడ్డుకు తీసుకువచ్చారు. అనంతరం పోలీసులకు సమాచారమివ్వగా.. తొలుత ఆ యువకుడికి సంబంధించిన వివరాలను చెప్పేందుకు నిరాకరించిన యువతి, కొద్దిసేపటి తర్వాత వివరాలను వెల్లడించింది. అతడిని ఏమీ అనవద్దని, తానే ప్రమాదవశాత్తు కాలుజారి పడిపోయానని తెలిపింది. యువతి వివరాలను తెలుసుకున్న పోలీసులు మచిలీపట్నం పోలీసులకు సమాచారమిచ్చారు.
తమ కూతురు కనిపించడం లేదని స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. విశాఖ పోలీసుల నుంచి సమాచారం రావడంతో.. వెంటనే కూతురి కోసం విశాఖకు బయల్దేరారు. కాగా.. యువతికి గాయాలు కావడంతో.. ఆమెను 108 వాహనంలో కేజీహెచ్ కు తరలించారు. ఈ ఘటనపై దువ్వాడ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. యువతిని ప్రమాదంలో వదిలేసి పరారైన యువకుడు రోడ్డు ప్రమాదానికి గురవ్వగా.. అతను కూడా కేజీహెచ్ లోనే చికిత్స పొందుతున్నాడు.