Madapur Drugs Case : టాలీవుడ్ నటుడు నవదీప్ (Navdeep ED Investigation) డ్రగ్స్ కేసులో ఈడీ విచారణకు హాజరయ్యారు. ఈ కేసులో నిందితుడిగా ఉన్న నవదీప్.. ఇప్పటికే నార్కోటిక్స్ బ్యూరో విచారణ ఎదుర్కొంటున్నారు. నవదీప్కు ఇటీవలే ఈడీ అధికారులు షాక్ ఇస్తూ..నోటీసులు జారీ చేశారు. నార్కోటిక్స్ బ్యూరో అధికారుల కేసు ఆధారంగానే ఈడీ అధికారులు నోటీసులు జారీ చేశారు. అయితే..ఇదే కేసులో ఆయనకు ఇప్పటికే రెండు సార్లు నోటీసులు పంపినా విచారణకు హాజరు కాలేదు. తాజాగా మూడోసారి నోటీసులు పంపడంతో.. నవదీప్ విచారణకు హాజరయ్యారు. నైజీరియన్ డ్రగ్స్ ముఠాతో నవదీప్కు సంబంధాలున్నాయని వచ్చిన ఆరోపణల నేపథ్యంలో ఈడీ అధికారులు నవదీప్ ను విచారణ చేస్తున్నారు.
మాదాపూర్ డ్రగ్స్ కేసులో నవదీప్ మెడకు ఉచ్చు బిగుసుకుంటోంది. ఇటీవల మాదాపూర్ ఫ్రెష్ లివింగ్ అపార్ట్ మెంట్లో జరిగిన డ్రగ్స్ పార్టీలో పోలీసులు రాంచందర్ అనే వ్యక్తితో పాటు పలువురిని అరెస్టు చేసి.. వారి నుండి భారీ మొత్తంలో డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. అయితే వీరిని విచారిస్తున్న సమయంలో రాంచందర్ కు నవదీప్తో డ్రగ్స్ డీలింగ్స్ జరిగాయని నార్కోటిక్ పోలీసులు గుర్తించారు. నవదీప్ మాదక ద్రవ్యాలు వినియోగించారని పేర్కొంటూ.. ఆయన పేరును A29గా పేర్కొన్నారు. అనంతరం నార్కోటిక్ బ్యూరో పోలీసులు నవదీప్ ఇంట్లో సోదాలు నిర్వహించి, ఆయనను కొన్ని గంటల పాటు విచారించారు.
నార్కోటిక్ అధికారులు గతంలో చేపట్టిన విచారణలో నవదీప్ కొన్ని విషయాలను వెల్లడించినట్లు సమాచారం. గతంలో రాంచందర్తో కలిసి తాను మాదక ద్రవ్యాలు తీసుకున్నట్లు నవదీప్ అంగీకరించాడన్న వార్తలు వినిపిస్తున్నాయి. డ్రగ్స్ కేసులో తనకు నోటీసులు ఇవ్వడంతో తాను నార్కోటిక్స్ బ్యూరో అధికారుల విచారణకు హాజరరైనట్లు అప్పట్లో నవదీప్ వెల్లడించాడు. ఈ కేసులో అరెస్టైన రాంచందర్తో తనకు పరిచయం ఉన్న మాట వాస్తవమే కానీ.. తాను ఎక్కడా డ్రగ్స్ తీసుకోలేదని పేర్కొన్నాడు. తాజాగా మరోసారి నవదీప్ డ్రగ్స్ కేసులో విచారణ ఎదుర్కోవడం టాలీవుడ్ లో ప్రకంపనలు సృష్టిస్తోంది.