Telangana Elections 2023 : తెలంగాణలో ఎన్నికల నగారా మోగింది. సోమవారం చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ ఎన్నికల షెడ్యూల్ ను ప్రకటించిన విషయం తెలిసిందే. నవంబర్ 30న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. కాగా.. నిన్నటి నుంచే రాష్ట్రంలో ఎలక్షన్ కోడ్ అమల్లోకి వచ్చింది. దీంతో నగర కమిషనర్ సీవీ ఆనంద్.. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు చేపట్టారు. హైదరాబాద్, సికింద్రాబాద్ లో వ్యక్తిగత ఆయుధాలు కలిగిన వ్యక్తులు వాటిని సమీప పోలీస్ స్టేషన్లలో ఈ నెల 16వ తేదీ లోగా డిపాజిట్ చేయాలని ఆదేశించారు. ఎన్నికలు ముగిసిన తర్వాత డిసెంబర్ 10న వాటిని తిరిగి తీసుకోవచ్చని తెలిపారు. ఎవరైనా ఆయుధాలను అందజేయని నేపథ్యంలో వారిపై చర్యలు తీసుకుంటామని సీవీ ఆనంద్ కీలక ఉత్తర్వులు జారీ చేశారు.అలాగే నగరంలో ఉన్న అన్ని రకాల పొలిటికల్ పోస్టర్లను తొలగించాలని ఆదేశించారు.
ఎన్నికలంటే చాలు.. ఎక్కడైనా డబ్బు, మద్యం ఏరులై పారుతుంది. రాష్ట్రంలో నిన్నటి నుంచి ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో పోలీసులు రాష్ట్ర వ్యాప్తంగా తనిఖీలను ముమ్మరం చేశారు. నిన్న హైదరాబాద్, సికింద్రాబాద్ పరిధులలో చేపట్టిన తనిఖీల్లో భారీగా నగదు లభ్యమైంది. సోమవారం (అక్టోబర్ 9) నిర్వహించిన తనిఖీలలో సుమారు రూ.20 కోట్ల నగదు, బంగారాన్ని పోలీసులు పట్టుకున్నారు. టాస్క్ ఫోర్స్ తనిఖీల్లో పట్టుబడిన మూడున్నర కోట్ల నగదును సీజ్ చేశారు.
ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో పోలీసులు తనిఖీలను ముమ్మరం చేశారు.సోమవారం ఒక్కరోజే.. తనిఖీల్లో దాదాపుగా రూ.20 కోట్ల నగదు, బంగారాన్ని పోలీసులు పట్టుకున్నారు. ప్రత్యేకించి టాస్క్ ఫోర్స్ తనిఖీల్లో మూడున్నర కోట్ల నగదు సీజ్ చేశారు. అబిడ్స్ నిజాం కాలేజ్ వద్ద తనిఖీల్లో 7కిలోల బంగారం, 300 కేజీల వెండిని స్వాధీనం చేసుకున్నారు. బేగంబజార్ లో రూ.3 లక్షలు, చైతన్యపురిలో రూ.30 లక్షల నగదును ఎస్వోటీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. శంకరపల్లిలో ఒక కార్ లో రూ.10 లక్షలు, మరో కారులో రూ.72 లక్షలు పట్టుబడ్డాయి. ఇక షాద్నగర్ టోల్ ప్లాజా వద్ద తనిఖీల్లో రూ.18 లక్షలు, వనస్థలిపురంలో రూ.4 లక్షలు సీజ్ చేశారు. జూబ్లీహిల్స్ లో రూ.50 లక్షల నగదును పట్టుకున్నారు. సరైన పత్రాలు లేకపోవడంతో పట్టుబడిన నగదు, నగలను పోలీసులు ఐటీ అధికారులకు అప్పగించారు.