Rahul Gandhi : దేశంలో కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో కులగణన చేపట్టేందుకు చర్యలు తీసుకోనున్నట్లు కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ వెల్లడించారు. సోమవారం ఐదు రాష్ట్రాలకు ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో.. ఢిల్లీ వేదికగా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశమైంది. అనంతరం రాహుల్ గాంధీ మీడియాతో మాట్లాడుతూ.. సమావేశంలో చర్చించిన అంశాలను వివరించారు. సీడబ్ల్యూసీ సమావేశంలో తాము కులగణనపై విస్తృతంగా చర్చించినట్లు తెలిపారు. కులగణన చేపట్టేందుకు అందరూ మద్దతినచ్చినట్లు రాహుల్ పేర్కొన్నారు.
కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల సీఎంలు ఆయా రాష్ట్రాల్లో కులగణన సర్వేలు నిర్వహిస్తారని రాహుల్ గాంధీ చెప్పారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల నుంచి కులగణనకు ఫుల్ సపోర్ట్ ఉంటుందని తెలిపారు. ఇప్పుడు దేశం మొత్తం కులగణననే కోరుకుంటోందని, అన్ని వర్గాల సంక్షేమమే కాంగ్రెస్ కోరుకుంటోందని రాహుల్ పేర్కొన్నారు. కులగణన చేపట్టాలన్నది రాజకీయ నిర్ణయం కాదని, ఇది ప్రజల కోసం తీసుకున్న నిర్ణయమని చెప్పారు రాహుల్. దేశంలో ఇప్పటికైనా కులగణన చేపట్టకపోతే బీజేపీ గద్దె దిగిపోవచ్చన్నారు. దేశంలో ఆదివాసీలు, దళితులు, ఓబీసీలు ఎంత మంది ఉన్నారో లెక్కతేలాలని రాహుల్ గాంధీ కేంద్రానికి సవాల్ చేశారు. అలాగే త్వరలోనే ఐదు రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ విజయం సాధించేందుకు కావలసిన వ్యూహాలపై చర్చించారు. కాంగ్రెస్ పార్టీ కులగణనకు అనుకూలంగా ఉందని, రాజస్థాన్ లో ఈ దిశగా ప్రక్రియ కూడా మొదలైందని కాంగ్రెస్ నేత భన్వర్ జితేంద్ర సింగ్ తెలిపారు.