Minister Srinivas Goud : తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఎన్నిక వివాదంపై తెలంగాణ హైకోర్టులో విచారణ ముగిసింది. దీనిపై రేపు తీర్పును వెల్లడిస్తామని ధర్మాసనం తెలిపింది. ఎన్నికల అఫిడవిట్లో తప్పుడు ధ్రువ పత్రాలు సమర్పించారని మహబూబ్నగర్కు చెందిన ఓటర్ రాఘవేంద్ర రాజు పిటిషన్ వేయగా.. దానిపై నాలుగేళ్ల సుదీర్ఘ విచారణ తర్వాత మంగళవారం (అక్టోబర్ 10) హైకోర్టు తీర్పు వెలువరించనుంది. ఈ నేపథ్యంలో కోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుందోనన్న ఉత్కంఠ అందరిలోనూ నెలకొంది.
మంత్రి శ్రీనివాస్ గౌడ్ 2018లో ఎన్నికల సమయంలో అఫిడవిట్ సమర్పించినప్పుడు తన ఆస్తులు, అప్పుల గురించి తప్పుడు సమాచారం అందించారని సీహెచ్ రాఘవేంద్రరాజు హైకోర్టులో పిటిషన్ వేశారు. ఎన్నికల అఫిడవిట్ను ఒకసారి రిటర్నింగ్ అధికారికి సమర్పించి.. మళ్లీ వెనక్కి తీసుకుని సవరించి అందజేశారని తెలిపారు. అయితే.. ఇది చట్టవిరుద్ధమని, ఆయన ఎన్నికను రద్దు చేయాలని రాఘవేంద్రరాజు న్యాయస్థానాన్ని కోరారు.
గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో అంటే నవంబర్ 14, 2018న శ్రీనివాస్ గౌడ్ మహబూబ్ నగర్ అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి 3 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. అదే రోజు మహబూబ్ నగర్ కే చెందిన రాఘవేంద్ర రాజు.. దాన్ని తెలంగాణ ఎన్నికల కమిషన్ వెబ్ సైట్ నుంచి డౌన్ లోడ్ చేసుకున్నారు. ఆ తర్వాత వెబ్ సైట్ లో అఫిడవిట్ కనిపించలేదు. మళ్లీ నవంబర్ 19, 2018న మరో అఫిడవిట్ ను పొందు పరిచినట్లు రాఘవేంద్ర రాజు గుర్తించారు. నిజానికి ఆ రోజు ఎలాంటి అఫిడవిట్ దాఖలు చేయలేదని చెబుతున్నారు. దీంతో రిటర్నింగ్ ఆఫీసర్ స్థాయిలో ట్యాంపరింగ్ జరిగిందంటూ నాటి నుంచి న్యాయపోరాటం చేస్తూ వస్తున్నారు.
ఇదే విషయంపై హైకోర్టులో కేసు వేశారు రాఘవేంద్ర రాజు. వెబ్ సైట్ లో అప్ లోడ్ చేసిన రెండు అఫిడవిట్లను కోర్టు ముందు ఉంచారు. వెబ్ సైట్ నుంచి అభ్యర్థి దాఖలు చేసిన ఒక అఫిడవిట్ ను తొలగించి మరో అఫిడవిట్ ను అప్ లోడ్ చేయడం రిటర్నింగ్ ఆఫీసర్ స్థాయిలోనే జరుగుతుందంటున్నారు. కేంద్ర ఎన్నికల సంఘం కూడా అఫిడవిట్ల అప్ లోడ్ బాధ్యత రిట్నింగ్ అధికారికే కట్టబెట్టింది. మరోవైపు నవంబర్ 12, 2018 నుంచి నవంబర్ 19, 2018 వరకు మహబూబ్ నగర్ సెగ్మెంట్లో ఎంత మంది, ఎన్ని సెట్లు నామినేషన్లు వేశారన్న విషయాలను కేంద్ర ఎన్నికల సంఘం నుంచి తెప్పించుకున్నారు. ఈ వివరాలన్నింటినీ పిటిషనర్ హైకోర్టుకు సమర్పించారు. ప్రజాప్రతినిధుల చట్టానికి తూట్లు పొడిచారంటూ ప్రైవేట్ కంప్లైంట్ కూడా ఇచ్చారు.
ఎన్నికల సంఘం రాజ్యాంగ ప్రతిపత్తి కలిగి ఉంటుంది. దేశంలో ఎన్నికలు రాగానే.. విశేష అధికారాలన్నీ ఈ సంస్థ చేతికి వస్తాయి. అభ్యర్థులు తప్పులు చేసినా.. ఇంకేం జరిగినా వెంటవెంటనే చర్యలు తీసుకుంటుంది. అలాంటిది మంత్రి శ్రీనివాస్ గౌడ్ అఫిడవిట్ ట్యాంపరింగ్ ఇష్యూలో సీఈసీనే చిక్కుకుంది. ఈ వివాదంలో చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్కుమార్ సహా 11 మందిపై కేసులు నమోదు చేయాలని ప్రజా ప్రతినిధుల కోర్టు ఆదేశాలు జారీ చేసింది. కోర్టు ఆదేశాలతో మహబూబ్నగర్ పోలీసులు, సీఈసీ రాజీవ్ కుమార్తో పాటు సీఈసీ కార్యదర్శి సంజయ్ కుమార్, గతంలో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారిగా పనిచేసిన సీనియర్ ఐఏఎస్ అధికారి శశాంక్ గోయల్, రాష్ట్ర ఆర్ధికశాఖ కార్యదర్శి రొనాల్డ్ రోస్, ఐఏఎస్ అధికారి వెంకట్రావు, డిప్యూటీ కలెక్టర్ పద్మశ్రీ, అప్పటి ఆర్డీఓ శ్రీనివాస్, ఐటీ టీమ్ సభ్యుడు వెంకటేష్ గౌడ్, న్యాయవాది రాజేంద్ర ప్రసాద్, రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగి సుధాకర్ పైనా కేసు నమోదు చేశారు. కేసుల నమోదును సీఈసీ సుప్రీంకోర్టులో సవాల్ చేయడంతో.. ప్రజా ప్రతినిధుల కోర్టు జడ్జ్ జస్టిస్ జయకుమార్ను సుప్రీంకోర్టు సస్పెండ్ చేసింది. ఎన్నికల అఫిడవిట్ కేసులో 11 మంది అధికారులపై కేసులు నమోదు చేయాలన్న ప్రజా ప్రతినిధుల కోర్టు తీర్పుపై అత్యున్నత న్యాయస్థానం ఆసహనం వ్యక్తం చేసింది. అంతే కాదు రాజ్యాంగబద్ధ వ్యవస్థలపై కేసులు నమోదు చేయమని ఎలా ఆదేశిస్తారని ప్రజా ప్రతినిధుల కోర్టును సుప్రీంకోర్టు ప్రశ్నించింది.