Nara Chandrababu Naidu : టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడికి షాకుల మీద షాకులు తగులుతున్నాయి. అంగళ్లు అల్లర్లు, ఫైబర్ గ్రిడ్, ఇన్నర్ రింగ్ రోడ్ కేసుల్లో ముందస్తు బెయిల్ కోరుతూ దాఖలు చేసిన పిటిషన్లను ఏపీ హైకోర్టు డిస్మిస్ చేసింది. సీఐడీ తరపు వాదనలతో ఏకీభవించిన కోర్టు.. కేసు విచారణలో ఉండగా బెయిల్ మంజూరు చేయడం కుదరదని తేల్చి చెప్పింది. దాంతో చంద్రబాబుకు ఊహించని షాక్ తగిలినట్లైంది. ఆ షాక్ నుంచి తేరుకోకుండానే ఏసీబీ కోర్టు మరో షాకిచ్చింది.
స్కిల్ డెవలప్ మెంట్ కేసులో బెయిల్, సీఐడీ కస్టడీకి దాఖలు చేసిన పిటిషన్లను ఏసీబీ కోర్టు డిస్మిస్ చేసింది. చంద్రబాబు తరపున సుప్రీంకోర్టు న్యాయవాది ప్రమోద్ కుమార్ దూబే.. సీఐడీ తరపున అదనపు ఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించారు. ఇరువురి వాదనలు విన్న ఏసీబీ కోర్టు కస్టడీ, బెయిల్ పిటిషన్లను డిస్మిస్ చేసింది. దీంతో ఏసీబీ కోర్టులోనూ చంద్రబాబుకు నిరాశే ఎదురైంది.
కాగా.. ఎస్ఎల్ పీ పై సుప్రీంకోర్టులో వాదనలు జరిగాయి. చంద్రబాబు తరపు హరీష్ సాల్వే రెండు గంటలకు పైగా వాదనలు వినిపించారు. సుదీర్ఘ వాదనల అనంతరం తదుపరి విచారణను ద్విసభ్య ధర్మాసనం రేపటికి వాయిదా వేసింది. చంద్రబాబు క్వాష్ పిటిషన్ పై రేపు కూడా విచారణ కొనసాగనుంది. రేపు ప్రభుత్వం తరపు న్యాయవాది తమ వాదనలను ధర్మాసనానికి వినిపించనున్నారు. ప్రభుత్వం తరపు వాదనలు రేపు జరగనున్న నేపథ్యంలో లాయర్ ముకుల్ రోహిత్గి ముందుగానే కోర్టు నుంచి వెళ్లిపోయారు. వరుస షాక్ ల తర్వాత.. రేపు ప్రభుత్వ వాదనలు విన్న అనంతరం సుప్రీంకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి.