Five States Election Schedule 2023 : తెలంగాణతో పాటు మరో నాలుగు రాష్ట్రాలకు ఎన్నికల నగారా మోగింది. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ తెలంగాణ, రాజస్థాన్, మిజోరాం, మధ్యప్రదేశ్, చత్తీస్ గఢ్ రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికల నిర్వహణ తేదీలను ప్రకటించారు. తొలుత మిజోరాంలో పోలింగ్ జరగనుంది. మిజోరాంతో పాటు చత్తీస్ గఢ్ లో 20 నియోజకవర్గాలకు తొలివిడత పోలింగ్ నిర్వహించనున్నట్లు వివరించారు. ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల నగారా మోగడంతో రాజకీయ పార్టీలు ప్రచారానికి సిద్ధమవుతున్నాయి. ప్రజలపై హామీల వర్షం కురిపించేందుకు ఇప్పటికే వ్యూహాలు రచించాయి. మేనిఫెస్టోలతో ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఆయా పార్టీల జాబితాల ప్రకటన అనంతరం అభ్యర్థులు ప్రచారం పర్వం మొదలుపెట్టనున్నారు.
ఐదు రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్ ఇదే..
మిజోరాంలో అక్టోబర్ 13న ఈసీ నోటిఫికేషన్ విడుదల చేయనుంది. అక్టోబర్ 20 వరకు అభ్యర్థుల నామినేషన్ల స్వీకరణ, అక్టోబర్ 21 వరకు నామినేషన్ల పరిశీలన, అక్టోబర్ 23న అభ్యర్థుల నామినేషన్ల ఉపసంహరణ ఉంటుందని సీఈసీ రాజీవ్ కుమార్ తెలిపారు. నవంబర్ 7న పోలింగ్, డిసెంబర్ 3న కౌంటింగ్ జరుగుతుందని సీఈసీ పేర్కొన్నారు.
మధ్యప్రదేశ్ లో అక్టోబర్ 21న ఈసీ నోటిఫికేషన్ విడుదల చేయనుంది. అక్టోబర్ 30 వరకు అభ్యర్థుల నామినేషన్ల స్వీకరణ, అక్టోబర్ 31 వరకు నామినేషన్ల పరిశీలన, నవంబర్ 2న అభ్యర్థుల నామినేషన్ల ఉపసంహరణ ఉంటుందని సీఈసీ రాజీవ్ కుమార్ తెలిపారు. నవంబర్ 17న పోలింగ్, డిసెంబర్ 3న కౌంటింగ్ జరుగుతుందని సీఈసీ పేర్కొన్నారు.
రాజస్థాన్ లో అక్టోబర్ 30న ఈసీ నోటిఫికేషన్ విడుదల చేయనుంది. నవంబర్ 6 వరకు అభ్యర్థుల నామినేషన్ల స్వీకరణ, నవంబర్ 7వరకు నామినేషన్ల పరిశీలన, నవంబర్ 9న అభ్యర్థుల నామినేషన్ల ఉపసంహరణ ఉంటుందని సీఈసీ రాజీవ్ కుమార్ తెలిపారు. నవంబర్ 23న పోలింగ్, డిసెంబర్ 3న కౌంటింగ్ జరుగుతుందని సీఈసీ పేర్కొన్నారు.
ఛత్తీస్ గఢ్ లో రెండు విడతలుగా అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించనున్నట్లు సీఈసీ వెల్లడించారు. తొలి విడత ఎన్నికలు నవంబర్ 7న జరుగుతాయన్నారు. అక్టోబర్ 13న ఈసీ నోటిఫికేషన్ విడుదల చేయనుంది. అక్టోబర్ 20 వరకు అభ్యర్థుల నామినేషన్ల స్వీకరణ, అక్టోబర్ 21 వరకు నామినేషన్ల పరిశీలన, అక్టోబర్ 23న అభ్యర్థుల నామినేషన్ల ఉపసంహరణ ఉంటుందని సీఈసీ రాజీవ్ కుమార్ తెలిపారు. నవంబర్ 7న పోలింగ్, డిసెంబర్ 3న కౌంటింగ్ జరుగుతుందని సీఈసీ పేర్కొన్నారు. 70 నియోజకవర్గాలకు నవంబర్ 17న రెండో విడత పోలింగ్ జరుగుతుందన్నారు. అక్టోబర్ 21న రెండో విడత ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలవుతుంది. అక్టోబర్ 30 వరకు అభ్యర్థుల నామినేషన్ల స్వీకరణ, అక్టోబర్ 31 వరకు నామినేషన్ల పరిశీలన, నవంబర్ 2న అభ్యర్థుల నామినేషన్ల ఉపసంహరణ ఉంటుందని సీఈసీ రాజీవ్ కుమార్ తెలిపారు. నవంబర్ 17న పోలింగ్, డిసెంబర్ 3న కౌంటింగ్ జరుగుతుందని సీఈసీ పేర్కొన్నారు.
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు నవంబర్ 3న ఈసీ నోటిఫికేషన్ విడుదల చేయనుంది. నవంబర్ 10 వరకు అభ్యర్థుల నామినేషన్ల స్వీకరణ, నవంబర్ 13న నామినేషన్ల పరిశీలన, నవంబర్ 15న అభ్యర్థుల నామినేషన్ల ఉపసంహరణ ఉంటుందని సీఈసీ రాజీవ్ కుమార్ తెలిపారు. నవంబర్ 30న పోలింగ్, డిసెంబర్ 3న కౌంటింగ్ జరుగుతుందని సీఈసీ పేర్కొన్నారు.
మొత్తంగా చూస్తే.. మిజోరాం తో పాటు చత్తీస్ గఢ్ లో 20 నియోజకవర్గాలకు తొలివిడత పోలింగ్ నవంబర్ 7న, మధ్యప్రదేశ్ తో పాటు ఛత్తీస్ గఢ్ లో 70 నియోజకవర్గాలకు నవంబర్ 17న రెండో విడత పోలింగ్ , రాజస్థాన్ లో 200 నియోజకవర్గాలకు నవంబర్ 23న, తెలంగాణలో 119 నియోజకవర్గాలకు నవంబర్ 30న అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఐదు రాష్ట్రాల్లో ఓట్ల లెక్కింపు డిసెంబర్ 3న జరగనుంది. ఎన్నికల ప్రక్రియ డిసెంబర్ 5వ తేదీతో ముగుస్తుందని సీఈసీ వెల్లడించారు.