MLA Shankar Narayana : ఆంధ్రప్రదేశ్ లోని శ్రీ సత్యసాయి జిల్లాలోని గోరంట్లలో ఆదివారం నిర్వహించిన బైక్ ర్యాలీలో స్థానిక ఎమ్మెల్యే శంకర నారాయణ పాల్గొన్నారు. ఈ క్రమంలో ఆయన పెద్ద ప్రమాదమే తప్పింది. ఓ ఆగంతకుడు ఎమ్మెల్యే కాన్వాయ్ పై డిటోనేటర్ ను విసిరాడు. గోరంట్ల మండలం గడ్డం తండా వద్ద ఎమ్మెల్యే శంకర నారాయణ గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు. తన వాహనం దిగి కొంత దూరం నడిచిన తర్వాత ఎమ్మెల్యే కాన్వాయ్ పై ఓ ఆకతాయి డిటోనేటర్ విసరడం కలకలం రేపింది. అయితే.. ఆ డిటోనేటర్ అదృష్టవశాత్తు పేలకపోవడంతో ఎమ్మెల్యేకు పెద్ద ప్రమాదమే తప్పింది.
ఎమ్మెల్యే కాన్వాయ్ పైకి విసిరిన డిటోనేటర్ గురితప్పి పొదలలో పడటం, అది పేలకపోవడంతో అక్కడున్నవారంతా ఊపిరిపీల్చున్నారు. అక్కడే ఉన్న కొందరు వైసీపీ కార్యకర్తలు ఆ వ్యక్తిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. నిందితుడు సోమందేపల్లి మండలం గుడిపల్లికి చెందిన వెంకటేష్ గా గుర్తించారు. కాగా.. వెంకటేష్ ఒక ప్రైవేట్ కంపెనీలో రోజువారి కూలీగా పనిచేస్తున్నాడు. గ్రానైట్ తవ్వకాల్లో భాగంగా పేలుళ్లకు ఉపయోగించే డిటోనేటర్ ను అతను ఉపయోగించినట్లు పోలీసులు నిర్థారించారు. అయితే అతడు మద్యంమత్తులో ఈ ఘాతుకానికి పాల్పడినట్లు చెబుతున్నారు. మద్యం మత్తులో పనికి వెళ్లడంతో వాళ్లు తిప్పి పంపించేయగా.. అక్కడి నుంచి డిటోనేటర్ ను తెచ్చి వెంకటేశ్ వాహనంపై విసిరేశాడని పేర్కొన్నారు. అది ఎలక్ట్రిక్ డిటోనేటర్ కాబట్టి ఎలక్ట్రిసిటీ కనెక్షన్ లేనిదే పేలదని పోలీసులు వివరించారు. దీనిపై పూర్తిస్థాయిలో దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.