Afghanistan Earth Quake : ప్రకృతి ప్రకోపానికి ఆఫ్ఘనిస్తాన్లో మారణహోమం తాండవించింది. వరుస భూకంపాలతో మృత్యుఘోష వినిపిస్తోంది. శనివారం పశ్చిమ ప్రాంతంలో సంభవించిన భూకంపం పెను విధ్వంసం సృష్టించింది. విపత్తు కారణంగా వేలాది మంది దుర్మరణం పాలయ్యారు. ఇళ్లు నేలకూలడంతో శిథిలాల కింద చిక్కుకున్న వారి కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. శిథిలాలను తొలగించే క్రమంలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.
పశ్చిమ ఆఫ్ఘనిస్తాన్లో వరుసగా ఏడుసార్లు భూప్రకంపనలు చోటు చేసుకోగా.. హెరాత్ ప్రావిన్స్లో 6.3 తీవ్రతతో కంపించిన తర్వాత నాలుగుసార్లు ప్రకంపనలు వచ్చాయి. ఈ విపత్తులో వందలాది ఇళ్లు నేలమట్టంకావడంతో మృతుల సంఖ్య 2000 దాటినట్టు అక్కడి అధికారులు వెల్లడించారు. ఇక రాత్రి, పగలు తేడా లేకండా సహాయక బృందాలు చర్యలను కొనసాగిస్తున్నాయి. శిథిలాల కింద చిక్కుకున్న వారి కోసం వీరు శ్రమిస్తున్నారు. కాగా.. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. భవనాలు నేలమట్టం కావడంతో కమ్యూనికేషన్ వ్యవస్థకు తీవ్ర ఆటంకం ఏర్పడింది. సుమారు 400కు పైగా ఇళ్లు ధ్వంసమవ్వగా, 100కు పైగా ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయని తాలిబన్ ప్రభుత్వ అధికారి వెల్లడించారు.