Minister RK Roja : ఏపీ మంత్రి రోజా, వైసీపీలో ఒంటరి అయ్యారా? మాజీ మంత్రి బండారు సత్యనారాయణ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై వెటరన్ హీరోయిన్లు స్పందిస్తున్నా.. సొంత పార్టీ నాయకులు ఎందుకు మాట్లాడ్డం లేదు? ఇదే ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో వినిపిస్తున్న ప్రశ్న. బీజేపీ నాయకురాలు, వెటరన్ హీరోయిన్ ఖుష్బూ నుంచి రాధిక, రమ్యకృష్ణ, మీనా, నవనీత్ కౌర్.. ట్విట్టర్ వేదికగా ఇప్పటి వరకు స్పందించారు. ఒక మహిళా నేతపై బండారు సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలను వారంతా ఖండించారు. ఆమెకు వెంటనే బండారు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తిపై ఓ రేంజ్లో విరుచుకుపడ్డారు. నువ్వసలు మనిషివేనా అంటూ తిట్టిపోశారు. రోజా తరఫున తాము పోరాటం చేస్తామంటూ మద్దతిచ్చారు. మరోవైపు.. ఈ నటీమణులను జనసేన నాయకులు టార్గెట్ చేస్తున్నారు. తలైవా రజనీకాంత్పై రోజా నోటికొచ్చినట్టు మాట్లాడితే .. ఆనాడు వీరంతా ఎందుకు స్పందించలేదని వాళ్లు ప్రశ్నిస్తున్నారు.
ఏపీ హోంమంత్రి కూడా మహిళ అయినప్పటికీ రోజా ఇష్యూపై ఇంతలా మాట్లాడిన దాఖలాలు లేవు. తానేటి వనితే కాదు.. వైసీపీలోని మహిళా ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా ఇది మాకు సంబంధంలేని విషయం అన్నట్టు సైలెంట్గా ఉన్నారు. రోజా వ్యవహారంపై ఇంతవరకూ ఆమె తోటి మహిళా మంత్రులు సైతం స్పందించకపోవడం గమనార్హం. అది ఆమె ప్రైవేటు వ్యవహారమని, తమకు సంబంధం లేదన్నట్టే వ్యవహరిస్తున్నారు. ఇదంతా చూస్తుంటే వైసీపీలో రోజా ఒంటరైనట్లే కనిపిస్తోంది. తనకు మద్దతివ్వాలని రోజా ఫోన్ చేసి కోరితేనే వెటరన్ హీరోయిన్లు స్పందించారు తప్ప.. ఇన్నాళ్లు వాళ్లు కూడా మద్దతివ్వలేదని ప్రతిపక్షాల నేతలు గుర్తుచేస్తున్నారు.