India Vs Australia: వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నమెంట్ లకు ఆతిథ్యం ఇస్తున్న భారత నేడు ఆస్ట్రేలియా తో తలపడనుంది. క్రికెట్ అభిమానులు ఎంతో ఉత్కంఠతతో ఎదురుచూస్తున్న ఈ మ్యాచ్ పై వరుణుడి ప్రభావం ఉండొచ్చు అని అంచనాలు. మెగా టోర్నీలో భాగంగా తమ తొలి పోరు కు సిద్ధమైన టీం ఇండియా చెన్నై వేదికగా ఈరోజు ఆదివారం నాడు ఆస్ట్రేలియా తో జరగబోతున్న మ్యాచ్ కోసం సిద్ధంగా ఉంది. ఇప్పటికే రోహిత్ సేన చెన్నై చేరుకోవడమే కాకుండా అక్కడ పరిస్థితులకు అలవాటు పడే విధంగా తీవ్రంగా శ్రమిస్తున్నారు.
నిన్న జరిగిన మ్యాచ్ తర్వాత సౌత్ ఆఫ్రికా వన్డే వరల్డ్ కప్ 2023 మ్యాచ్లకు సరికొత్త దిశను నిర్దేశించింది. ఇప్పటివరకు ఒక లెక్క.. ఇకనుంచి ఒక లెక్క అన్నట్లు ఉంది పరిస్థితి. ప్రపంచ కప్ కోసం తమ టీమ్ చేసే వేటను ఎంతో జోరుగా మొదలుపెట్టాలి అనుకుంటున్న రోహిత్ సేనకు వాతావరణం అచ్చోచ్చేలా కనిపించడం లేదు. ఆసియా కప్ తర్వాత నుంచి టీం ఇండియా ఎక్కడ ఏ మ్యాచ్ ఆడుతుంటే అక్కడికి వరుణుడు వెంట వస్తున్నాడు. దీంతో టీం ఇండియా ఆడిన మ్యాచులు కంటే వర్షం కారణంగా ఆడకుండా ఉన్న మ్యాచులు ఎక్కువగా ఉన్నాయి.
శ్రీలంకకు టాటా చెప్పి భారత్ లో అడుగుపెట్టినా సరే వర్షం మాత్రం వెంటాడుతూనే ఉంది అని అనిపిస్తుంది. వరల్డ్ కప్ లో భాగంగా గౌహతి ,తిరువనంతపురం ఈ రెండు మ్యాచెస్ కూడా వర్షం కారణంగా రద్దు చేయాల్సి వచ్చింది. ఇక ఈరోజు ఆస్ట్రేలియా తో పోరుకు సిద్ధంగా ఉన్న సమయంలో కూడా వర్షం గండం ఉందేమో అనిపిస్తుంది. చెన్నై వేదికగా జరగనున్న భారత్ ఆస్ట్రేలియా మధ్య మ్యాచ్ కోసం క్రికెట్ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. అయితే గత నాలుగు రోజులుగా తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తున్నాయి. అంతేకాకుండా నుంగంబాకంలో గత 24 గంటల సమయంలో 11 మిల్లీమీటర్ల వర్షం కురవడంతో ప్రాక్టీస్ ని కూడా ఆపివేసి పిచ్ ని కవర్లతో కప్పేయడం జరిగింది. ఈ ఊహించని పరిణామం అభిమానులను ఆందోళనకు గురిచేస్తుంది.
వాతావరణ శాఖ సమాచారం ప్రకారం రాబోయే రెండు రోజులపాటు కూడా చెన్నైలో అక్కడక్కడ జల్లులు పడే అవకాశం ఉంది. అయితే ఈరోజు మధ్యాహ్నం రెండు గంటలకు మొదలు కాబోతున్న ఈ మ్యాచ్ ఛేజింగ్ దశలో ఉరుములతో కూడిన భారీ వర్షం కురిసే అవకాశం కూడా ఉంది అని వెదర్ రిపోర్ట్. ఇదే జరిగితే ఇక టీం ఇండియా అభిమానులు తీవ్ర నిరాశకు లోనవ్వడం కన్ఫర్మ్. ఒకవేళ మ్యాచ్ జరిగే సమయానికి వర్షం పడినా .. ఓవర్లు తగ్గించి మరీ మ్యాచ్ జరిపించే ఛాన్స్ ఉంది. మరి మ్యాచ్ సందర్భంగా వరుణ దేవుడు కరుణిస్తాడా లేక వాన కురిపించి అభిమానుల ఆశలపై నీరు చల్లుతాడ అనే విషయం ఇంకాసేపటిలో తేలిపోతుంది.