Komuravelli Temple : సాధారణంగా ఆదాయపు పన్నును కట్టని వారికి ఐటీ శాఖ నోటీసులు జారీ చేస్తుంటుంది. వారి నుంచి టాక్స్ ను వసూలు చేస్తుంది. ఇలా ఎంతో మంది వ్యాపారులు, ఇతర రంగాలకు చెందిన వారి నుంచి ఐటీ శాఖ ప్రభుత్వానికి రావాల్సిన టాక్స్ ను రాబడుతుంది. అయితే తాజాగా తెలంగాణలోని పలు ప్రముఖ దేవాలయాలకు ఆదాయపు పన్ను శాఖ అధికారులు నోటీసులు జారీ చేశారు. నోటీసులు అందుకున్న దేవాలయాలు ఆదాయపు పన్ను కట్టాలంటూ అందులో తెలిపారు. ఈ జాబితాలో కొమురవెల్లి మల్లన్న స్వామి మొదటి స్థానంలో ఉన్నారు. రూ.8 కోట్ల ట్యాక్స్ కట్టాలని, సకాలంలో పన్ను కట్టనందువల్ల మరో 3 కోట్ల 39 లక్షల రూపాయల జరిమానాతో కలుపుకుని మొత్తంగా.. రూ.12 కోట్ల వరకు చెల్లించాలని నోటీసుల్లో తెలిపారు.
ఆధ్యాత్మిక, ధార్మిక, దేవాదాయ ధర్మాదాయ శాఖ సంబంధిత సంస్థలకు ఐటీ నుంచి మినహాయింపు ఇవ్వడానికి ఆదాయ పన్ను చట్టంలోని సెక్షన్ 12ఏ కింద రిజిస్ట్రేషన్ చేసుకుంటే దేవాలయాలకు ఆదాయ పన్ను నుంచి మినహాయింపు ఉంటుంది. కానీ ఇక్కడి ఉన్నతాధికారుల నిర్లక్ష్యం కారణంగా 12ఏ కింద రిజిస్ట్రేషన్ చేసుకోకపోవడంతో 12 కోట్లు దేవాలయం బకాయి పడ్డది. మొత్తంగా 1995 నుంచి ఐటీ రిటర్న్స్ సమర్పించకపోవడంతో నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది.
కేవలం ఇలా కొమురవెల్లి మల్లన్న దేవాలయానికి కాకుండా తెలంగాణలో దక్షిణ కాశీగా పేరొందిన వేములవాడ రాజన్న టెంపుల్ కు కూడా నోటీసులు ఇచ్చారు.అదేవిధంగా చదువుల నిలయమైన బాసర సరస్వతి ఆలయానికి సైతం ఆదాయపు పన్ను శాఖ నోటీసులు పంపింది. ఆదాయపు పన్ను కట్టాలంటూ ఆలయాలకు ఐటీ నోటీసులు ఇవ్వటం రాష్ట్రంలో సంచలనం గా మారింది. దేవాలయాలకు ఐటీ నోటీసులు ఇవ్వడంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.