Team India 2023 : ప్రపంచ కప్ ను భారత్ మూడోసారి ముద్దాడుతుందా? రోహిత్ సేనకు ఆ సత్తా ఉందా? స్వదేశంలోని పాజిటివ్ కండీషన్లు టీమిండియాకు ప్లస్ పాయింట్స్ గా మారాయా? అంటే అవుననే అంటున్నారు భారత్ క్రికెట్ ఫ్యాన్స్. టీమిండియా కప్ కొడుతుందన్న విశ్వాసంతో ఉన్నారు. అసలు భారత్ జట్టు బలాబలాలు ఎలాగున్నాయో తెలుసుకుందాం.
వన్డే ప్రపంచ కప్ లో భారత్ హాట్ ఫేవరేట్ అనడంలో సందేహం లేదు. స్వదేశంలో ఈ మెగా టోర్ని జరగనుండటం సానుకూలాంశం. వన్డే ప్రపంచ కప్ టోర్నికి ముందు భారత్ జట్టు సూపర్ ఫామ్ లోకి వచ్చింది. రోహిత్ సేన ఆసియా కప్ ను కైవసం చేసుకుని సత్తా చాటింది. పాకిస్థాన్, శ్రీలంక జట్లను సునాయాసంగా ఓడించింది. ఈ సిరీస్ లో కేఎల్ రాహుల్ ఫామ్ ను అందుకున్నాడు. కులదీప్ స్పిన్ మాయాజలం ప్రదర్శించాడు. బుమ్రా లయ అందుకున్నాడు. ఆసియా కప్ ఫైనల్ లో శ్రీలంకపై.. మహ్మద్ సిరాజ్ సంచలన స్పెల్ తో సత్తా చాటాడు. ఒకే ఓవర్ లో నాలుగు వికెట్లు తీసి దుమ్మ రేపాడు. ఇలా బ్యాటర్లు, బౌలర్లు చెలరేగడంతో భారత్ ఆసియా కప్ ను కైవసం చేసుకుంది.
ఆసియా కప్ తర్వాత ఆస్ట్రేలియాతో స్వదేశంలో జరిగిన వన్డే సిరీస్ ను టీమిండియా గెలిచింది. ఆసీస్ పై శ్రేయస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్ విధ్వంసం సృష్టించి తమ సత్తా చాటారు. గిల్, రోహిత్ , కోహ్లి, రాహుల్ అదే ఫామ్ ను కొనసాగించారు. సీనియర్ పేసర్ షమీ తనలో సత్తా తగ్గలేదని నిరూపించుకున్నాడు. రవిచంద్రన్ అశ్విన్ తనకిచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకున్నాడు.ఈ ప్రదర్శనతోనే చివరి క్షణంలో ప్రపంచ కప్ జట్టులోనూ అశ్విన్ చోటు సంపాదించాడు.
ఓపెనర్లు రోహిత్ శర్మ, శుభమన్ గిల్ తోపాటు విరాట్ కోహ్లి, కేఎల్ రాహుల్ సూపర్ ఫామ్ లో ఉన్నారు. ఇషాన్ కిషన్ కూడా తనకు వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకున్నాడు. ఇలా బ్యాటింగ్ ఆర్డర్ లో భారత్ కు ఎలాంటి సమస్యలు లేవు. ఏడుగురు బ్యాటర్లు అందుబాటులో ఉన్నారు. తుది జట్టు ఎంపికే భారత్ కు ఉన్న ప్రధాన సమస్య. రోహిత్, గిల్, కోహ్లి, రాహుల్ కచ్చితంగా తుది జట్టులో ఉంటారు. ఇక మరో బ్యాటర్ కు మాత్రమే తుది జట్టులో స్థానం దక్కే ఛాన్స్ ఉంది. అయ్యర్, సూర్య, ఇషాన్ కిషన్ లో ఒక్కరికే తుది జట్టులో చోటు ఉంటుంది. ఎవరికి ఆ ఛాన్స్ దక్కుతుందనేది ఆసక్తిగా మారింది.
ఆల్ రౌండర్లు హార్థిక్ పాండ్యా, రవీంద్ర జడేజాలకు చోటు గ్యారంటీ. భారత్ పిచ్ లు స్పిన్నర్లకు అనుకూలిస్తాయి కాబట్టి.. తుది జట్టులో కులదీప్ యాదవ్, రవిచంద్రన్ అశ్విన్ కు ఛాన్స్ ఇస్తారు. జట్టులో ఇద్దరు పేసర్ల స్థానాలను బుమ్రా, మహ్మద్ సిరాజ్ భర్తీ చేస్తారు. అయితే సిరాజ్ కు సీనియర్ పేసర్ మహ్మద్ షమీ నుంచి గట్టి పోటీ ఉంది. ఈ ఇద్దరిలో ఒక్కరికే ఛాన్స్ దక్కుతుంది. ఆసియా కప్ , ఆస్ట్రేలియాతో సిరీస్ ల్లో వికెట్లు తీసినా భారీగా పరుగులు సమర్పించుకున్న శార్థుల్ ఠాకూర్ బెంచ్ కే పరిమితమయ్యే అవకాశాలున్నాయి.