Actor Navdeep : సినీ నటుడు నవదీప్కు ఈడీ నోటీసులు ఇచ్చింది. డ్రగ్స్ కేసులో 41 CRPC నోటీసు ఇచ్చిన ఈడీ.. ఈ నెల 10వ తేదీన విచారణకు హాజరుకావాలని ఆదేశించింది. 2017లో ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ నమోదుచేసిన కేసులో భాగంగా ఈ నోటీసులు జారీ చేసింది. ఈ కేసులో మనీలాండరింగ్ జరిగిందని ఈడీ భావిస్తోంది. ఇటీవల మాదాపూర్ డ్రగ్స్ కేసులో నవదీప్ కు డ్రగ్స్ కన్య్సూమర్ గా పేర్కొన్న నేపథ్యంలో నార్కోటిక్ బ్యూరో ఒకసారి విచారణ చేసింది. నవదీప్ కు నైజీరియన్ డ్రగ్ పెడ్లర్ తో సంబంధాలున్నట్లుగా నార్కోటిక్ బ్యూరో విచారణలో గుర్తించింది.
గత నెలలో నగరంలో నార్కోటిక్స్ బ్యూరో అధికారులు మాదాపూర్ పోలీసులతో కలిసి డ్రగ్స్ సరఫరా విషయంలో ఆపరేషన్ నిర్వహించారు. ఇందులో భాగంగా నైజీరియాకు చెందిన వారితో పాటు ఒక దర్శకుడు, మరో నలుగురు వ్యక్తులను అరెస్ట్ చేసి, వారి నుంచి డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. అరెస్ట్ చేసిన వారిని విచారించగా.. వారు నవదీప్ తో సంప్రదింపులు జరిపినట్లుగా తేలడంతో.. నవదీప్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇటీవలే నవదీప్ ను పోలీసులు విచారించారు. తాజాగా మరోసారి విచారణకు రావాలని నోటీసులు జారీ చేయడంతో ఇండస్ట్రీ వర్గాల్లో ఈ విషయం చర్చనీయాంశమైంది. కాగా.. గతంలో రకుల్ ప్రీత్ సింగ్, రానా దగ్గుబాటి, రవితేజ, ఛార్మి, ముమైత్ ఖాన్, తనీష్, నందు, తరుణ్లను ఇప్పటికే ఈడీ విచారించింది.