Banjarahills CI Narender : ప్రభుత్వ కొలువులు చేసేవారు చేతి మామూళ్లకు బాగా అలవాటుపడతారన్న పేరు ఎప్పటినుండో ఉంది. అందులోనూ పోలీసులంటే.. లంచాలు తీసుకోనిదే పనిచేయరని ప్రజల్లో బలంగా నాటుకుపోయింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఓ సీఐ వ్యవహారం చూస్తే.. ప్రజల నమ్మకమే నిజమనిపించడం ఖాయం. నెలవారీ లంచాలకు అలవాటుపడిన పోలీసులు.. ధనార్జనే ధ్యేయంగా ఎంతకైనా తెగిస్తున్నారు. ఇలాంటి లంచాల పోలీసుల వ్యవహారం ఉన్నత అధికారులకు తలనొప్పిగా మారుతోంది.
బంజారాహిల్స్ సీఐ నరేందర్ వ్యవహారం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఓ పబ్ యజమాని నుంచి రూ.50 వేలు లంచం తీసుకుంటుండగా.. వీడియో తీసి ఏసీబీకి ఇచ్చారు. ప్రజల నుంచి, వ్యాపార సంస్థల నుంచి లంచాలు తీసుకోవడానికి అలవాటు పడిన నరేందర్ తీరుపై పై అధికారులు అసహనం వ్యక్తం చేశారు. తీరు మార్చుకోవాలని హెచ్చరించినా అతను మారలేదు. నెలవారీ లంచాల కోసం వ్యాపారులను, ప్రజలను వేధిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. సీఐ నరేందర్ అడిగే లంచాలివ్వలేక కంప్లైంట్ చేసేందుకు స్టేషన్ కు రావాలంటేనే బాధితులు భయపడే పరిస్థితి వచ్చింది. పబ్బులు, స్పా ల నుంచి నెలవారీ మామూళ్లు వసూలు చేసినట్లు కూడా ఆరోపణలున్నాయి.
ప్రస్తుతం బంజారాహిల్స్ సీఐగా ఉన్న నరేందర్.. తన స్టేషన్ పరిధిలో కొత్త స్పా సెంటర్లు తెరవాలంటే తన పర్మిషన్ తప్పనిసరిగా తీసుకోవాల్సిందేనని హోంగార్డులతో సెటిల్మెంట్లు చేయిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఫలితంగా సీఐ నరేందర్ వ్యవహారం పోలీసులకు తలనొప్పిగా మారింది. ఒక్కో పబ్ నుంచి రూ.40 వేల చొప్పున లంచం తీసుకుంటున్నారని, ఇటీవల ఈ మొత్తాన్నీ లక్ష రూపాయలకు పెంచారని సమాచారం. సీఐ నరేందర్ లంచాల కోసం ఇంతలా డిమాండ్ చేయడానికి కారణం ఓ మాజీమంత్రి అండగా ఉండటమేనన్న విషయం తెరపైకి వచ్చింది. ఆ మాజీమంత్రే పట్టుబట్టి మరీ నరేందర్ కు బంజారాహిల్స్ లో పోస్టింగ్ ఇప్పించారన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. పబ్ యజమాని నుంచి లంచం తీసుకున్న కేసులో మాజీమంత్రే రాజీ కుదిర్చి , ఆ రూ.50 వేలు వెనక్కి ఇప్పించినట్లు సమాచారం. తాజాగా ఒక సివిల్ కాంట్రాక్టర్ నుంచి రూ.3 లక్షలు లంచం తీసుకుంటూ సీఐ నరేందర్ పట్టుబడటం హాట్ టాపిక్ గా మారింది. వరుస ఘటనలతో నరేందర్ వ్యవహారం పోలీసులకు తలనొప్పిగా మారింది.