Telangana Elections 2023 : హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో రెండో రోజు టీటీడీపీ నేతలతో బాలకృష్ణ సమావేశమయ్యారు. టీడీపీ ఎన్నికల కమిటీ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఎన్నికల వ్యూహాలు, అభ్యర్థుల ఎంపికపై చర్చలు జరిపారు. టీడీపీ అధినేత చంద్రబాబు స్కిల్ స్కామ్ కేసులో జైల్లో ఉండటంతో బాలయ్య టీటీడీపీ నేతలను సమన్వయం చేస్తున్నారు. తెలంగాణ ఎన్నికలకు త్వరలోనే షెడ్యూల్ వస్తుండటంతో.. టీటీడీపీపై ఫోకస్ పెట్టారు. ఎన్నికలకు ఎలా సిద్దం కావాలన్న అంశంతో పాటు అభ్యర్థుల ఎంపికపై తెలంగాణ టీడీపీ నేతలతో బాలయ్య చర్చిస్తున్నారు.
నిజానికి టీటీడీపీ అభ్యర్థుల కసరత్తు ఇప్పటికే ప్రారంభం కావాల్సి ఉంది. కానీ చంద్రబాబు అరెస్ట్ కావడంతో ఆ ప్రక్రియ నిలిచిపోయింది. దీంతో ఇప్పుడు బాలయ్య రంగంలోకి దిగారు. తెలంగాణ ఎన్నికలపై రాష్ట్ర నేతలతో వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే తెలంగాణ ఎన్నికల్లో తమ బలం ఏంటో చూపిస్తామన్నారు బాలకృష్ణ.
మరోవైపు ఏపీలో టీడీపీ-జనసేన కలిసి పోటీ చేయాలని ఇప్పటికే నిర్ణయించాయి. ఇప్పటికే ఎవరెన్ని సీట్లలో పోటీ చేయాలి? ఉమ్మడి కార్యచరణ ఎలా ఉండాలి? అన్న దానిపై చర్చలు జరుగుతున్నాయి. అయితే ఏపీ కంటే ముందే తెలంగాణలో ఎన్నికల నగారా మోగనుంది. జనసేన 32 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తున్నట్టు ప్రకటించింది. మరి తెలంగాణలో కూడా టీడీపీ-జనసేన కలిసి పోటీ చేస్తాయా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. త్వరలోనే ఈ విషయంపై ఇరు పార్టీలు ఒక నిర్ణయం ప్రకటించనున్నట్టు తెలుస్తోంది.
పొత్తుల అంశాన్ని పక్కన పెట్టి ఎన్నికలపై ఫోకస్ చేయాలని బాలకృష్ణ నేతలకు దిశానిర్దేశం చేశారు. అయితే జనసేనతో కలిసి నడిచే అంశంపై పవన్తో చర్చించేందుకు బాలకృష్ణ సిద్ధమయ్యారని తెలుస్తోంది. త్వరలోనే ఈ భేటీ జరుగుతుందని ఆ తర్వాత ఇరు పార్టీల పొత్తుపై ఓ క్లారిటీ వస్తుందని సమాచారం.
ఇక జనసేన పోటీ చేసే అనేక స్థానాల్లో సెటిలర్లు ఎక్కువగా ఉన్నట్టు క్లియర్ కట్గా తెలుస్తోంది. ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్, ఖమ్మంలో ఎక్కువగా ప్రభావం చూపే అవకాశం కనిపిస్తోంది. ఈ స్థానాల్లో టీడీపీ-జనసేన కలిసి పోటీకి వెళ్తే.. కొన్ని సీట్లు వారి ఖాతాల్లో పడటం ఖాయమన్న ప్రచారం జోరుగా కొనసాగుతోంది. అయితే జనసేన ప్రకటించిన కొన్ని స్థానాల్లో టీడీపీ కూడా బరిలోకి దిగాలని చూస్తోంది.
ముఖ్యంగా కూకట్పల్లి, ఎల్బీనగర్, శేరిలింగంపల్లి, ఖమ్మం, కోదాడ, సత్తుపల్లి ఇతర నియోజకవర్గాల్లో తమ ప్రాబల్యం ఎక్కువగా ఉందనేది టీడీపీ నేతల ఆలోచన. ఇప్పటికీ ఈ నియోజకవర్గాల్లో టీడీపీకి ఇంకా కొంత ఓటు బ్యాంకు ఉందని, సీట్లు గెలవకపోతే కొంత ఓట్లు రాబట్టుకోవాలని భావిస్తోంది. మరి బాలకృష్ణ, పవన్ దీనిపై ఎలా ముందుకు వెళతారనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది.