Kolhapur Temple : మనదేశంలో లక్ష్మీదేవికి ప్రత్యేకంగా నిర్మించిన ఆలయాలు బహు తక్కువ. అలాంటి వాటిలో కొల్హాపుర్లోని మహాలక్ష్మీ ఆలయం ఒకటి. స్థానికులు దీనిని అంబాబాయి దేవాలయమని పిలుస్తారు.
మహారాష్ట్రలోని పంచ గంగానదీ తీరాన గత ఈ ఆలయం.. అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటి. దక్షయజ్ఞ సమయాన అమ్మవారి నేత్రాలు ఇక్కడ పడ్డాయట.
ఏడవ అష్టాదశ శక్తి పీఠమైన దీనికి కరవీర నగరమనే పేరూ ఉంది. కాశీ పట్టణాన్ని వదిలి ఎలా ఉండలేడో.. లక్ష్మీనారాయణులకు ఇది అలాంటి పట్ణణమని పేరు.
ప్రళయకాలంలో శివుడు తన త్రిశూలంతో కాశీ పట్టణాన్ని ఎత్తి కాపాడినట్లే.. కొల్హాపురిని లక్ష్మీదేవి తన చేతులతో ఎత్తి కాపాడిందనీ, అందుకే ఆమెను కరవీర మహాలక్ష్మి అని చెబుతారు.
వైకుంఠంలో నాడు భృగు మహర్షి విష్ణువు వక్షస్థలాన్ని కాలితో తన్నగా.. స్వామి హృదయస్థానంలోని లక్ష్మీదేవి దీనిని అవమానంగా భావించి, భూలోకంలోని కొల్హాపూర్ వచ్చి ఇక్కడ తపస్సు చేసిందనీ చెబుతారు.
గర్భగుడిలో ఆరడుగుల వేదికపై ఉన్న రెండడుగుల పీఠంపై కూర్చొన్న భంగిమలో అమ్మవారు కనిపిస్తుంది. నాలుగు చేతులలో పండు, గద, డాలు, పానపాత్ర ధరించి వుంటుంది
గర్భాలయ గోడపై ఆదిశంకరులు ప్రతిష్టించిన శ్రీచక్రం ఉంది. అమ్మవారి విగ్రహానికి వెనక భాగంలో సింహం కూడా ఉంటుంది.
దత్తాత్రేయుడు ప్రతి రోజూ మధ్యాహ్నం ఇక్కడ భిక్ష చేస్తారని ప్రతీతి. అందుకు రుజువుగా ఆలయ ప్రాంగణంలో ఆయనకు ఒక చిన్న ఉపాలయం ఉంది.
ఇక్కడి గర్భగుడిని చాళుక్యుల సామంతుడైన కర్ణదేవుడు క్రీ.శ 624 సంవత్సరంలో నిర్మించగా, అనంతరం శిలాహార పాలకుడు గండరాదిత్య ఆలయ శిఖరాన్ని నిర్మించాడు.
సంవత్సరానికి 3 రోజుల్లో.. సూర్యాస్తమయ సమయంలో సూర్య కిరణాలు గర్భాలయపు పడమటి దిక్కున గల కిటికీగుండా అమ్మవారి ముఖాన్ని తాకుతాయి.
విద్యాశంకర భారతి స్వామి ఈ క్షేత్ర మహిత్యాన్ని గుర్తించి ఇక్కడ ఒక మఠం నిర్మించారు.