CM Breakfast Scheme : ఎన్నికల సమీపిస్తున్న వేళ తెలంగాణలో నేతలు ప్రజల్లోకి వెళ్తున్నారు. వరుస పథకాలు అమలు చేస్తూ ప్రభుత్వం ముందుకుసాగుతోంది. ఎన్నికల కోడ్ రాకుండానే చాలా పథకాలను అమలు చేసేందుకు బీఆర్ఎస్ పార్టీ సన్నాహాలు చేస్తోంది. ఇందులో భాగంగా సీఎం అల్పాహార పథకాన్ని మంత్రులు వివిధ చోట్ల ప్రారంభించారు.
తెలంగాణలో నేటినుంచి మరో పథకం అమల్లోకి వచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా 27 వేల స్కూళ్లలో 23 లక్షల మంది పిల్లలకు బ్రేక్ పాస్ట్ అందిస్తున్నట్లు మంత్రి కేటీఆర్ వెల్లడించారు. సికింద్రాబాద్లో జరిగిన ప్రారంభోత్సవ కార్యక్రమంలో కేటీఆర్ పాల్గొన్నారు. తమిళనాడులో ఐదో తరగతి వరకు పథకం ఉందని.. పెద్ద మనసుతో సీఎం కేసీఆర్ తెలంగాణలోనూ దీనిని అమలు చేస్తున్నట్లు చెప్పారు. అధికారులు, ప్రజాప్రతినిధులు ఎప్పటికప్పుడు బ్రేక్ ఫాస్ట్ నాణ్యతను చెక్ చేయాలని మంత్రి సూచించారు. తల్లిదండ్రులిద్దరూ కూలిపనులకు వెళ్లే ఇంట్లో ఈ పథకం చాలా ఉపయుక్తంగా ఉంటుందని కేటీఆర్ అన్నారు.
రంగారెడ్డి జిల్లా రావిర్యాలలో సర్కారు టిఫిన్స్ కార్యక్రమాన్ని మంత్రులు హరీష్రావు, సబిత ప్రారంభించారు. అనంతరం చిన్నారులతో కలసి వారు కూడా అల్పాహారం తిన్నారు. మానవీయ కోణంలో ఆలోచించి సీఎం గారు.. ఈ కార్యక్రమం చేపట్టారని హరీష్ తెలిపారు. ఈ పథకం ద్వారా 20 లక్షల మంది విద్యార్థులకు ఎంతో ఉపయోగపడుతుందని చెప్పారు. దేశంలో విద్యార్థులకు బ్రేక్ ఫాస్ట్ అందించే ఒకే ఒక్క రాష్ట్రం తెలంగాణ అని మంత్రి అన్నారు. సీఎం బ్రేక్ ఫాస్ట్ పథకం.. విద్యా వ్యవస్థలో సమూల మార్పు తెస్తుందని మంత్రి సబిత అభిప్రాయం వ్యక్తం చేశారు.
దసరా తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా బ్రేక్ ఫాస్ట్ పథకం అమలు కానుంది. అల్పాహారం పథకంలో ఉప్మా, కిచిడీ, పొంగల్తో పాటు ఇడ్లీ, పూరిని కూడా చేర్చారు. అల్పాహారం మెనూను సర్కారు గురువారం అధికారికంగా విడుదల చేసింది. అసెంబ్లీ నియోజకవర్గానికి ఒక పాఠశాల చొప్పున 119 చోట్ల పథకాన్ని ప్రారంభించారు. అల్పాహారానికి 45 నిమిషాల సమయం కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. హైదరాబాద్, సికింద్రాబాద్లో పాఠశాలలు ఉదయం 8 గంటల 45 నిమిషాలకు మొదలవుతాయి. అక్కడ ఉదయం 8 గంటలకు అల్పాహారం అందజేస్తారు. జిల్లాల్లోని బడుల్లో తరగతులు ఉదయం 9 గంటల 30 నిమిషాలకు మొదలవుతాయి. ఇక్కడ 8 గంటల 45 నిమిషాలకు అల్పాహారం ఇస్తారు. అంటే అల్పాహారం సరఫరా ప్రారంభమయ్యే సమయానికి ఒక్క ఉపాధ్యాయుడైనా హాజరు కావాల్సి ఉంటుందని విద్యాశాఖ వర్గాలు తెలిపాయి. గురుకులాల్లో రొటేషన్ పద్ధతిలో ఒకరు ఉంటారని, అదే విధానం అమలవుతుందని స్పష్టం చేస్తున్నారు.
దసరా సెలవులు ముగిసిన తర్వాత అన్ని పాఠశాలల్లో పథకం అమలవుతుందని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. పథకం అమలును పర్యవేక్షించే బాధ్యతను పట్టణ ప్రాంతాల్లో మున్సిపల్ కమిషనర్లకు, గ్రామీణ ప్రాంతాల్లో అదనపు కలెక్టర్లకు అప్పగిస్తామన్నారు. విద్యాశాఖ, పంచాయతీరాజ్, స్త్రీ, శిశు సంక్షేమ శాఖల సమన్వయంతో పనిచేసి ఈ పథకాన్ని సమర్థంగా అమలు చేస్తామని పేర్కొన్నారు. పేద విద్యార్థులకు పోషకాహారం ఇవ్వడానికి పథకాన్ని అమలు చేస్తున్నందుకు సీఎం కేసీఆర్కు మంత్రి కృతజ్ఞతలు తెలిపారు.