Makara Thoranam : దేవాలయాలలో దేవతా విగ్రహాల వెనుక అమర్చిన తోరణ మధ్యభాగంలో కనుగుడ్లు ముందుకు చొచ్చుకు వచ్చిన ఒక రాక్షసముఖం కనబడుతుంది. దానినే ‘మకరతోరణం’ అంటారు.
దీనికి సంబంధించిన కథ.. స్కాందపురాణంలో ఉంది. దాని ప్రకారం… పూర్వం “కీర్తిముఖుడు” అనే రాక్షసుడు బ్రహ్మ వరంతో శక్తివంతుడిగా మారి.. ఏకంగా పార్వతీదేవిని మోహిస్తాడు.
అతడి అహంకారానికి మండిపడిన శివుడు.. భయంకరమైన అగ్నిని సృష్టించి.. ఆ రాక్షసుడిని మింగేయమని ఆదేశిస్తాడు.
పరమేశ్వరుని ఆనతి మేరకు ఆ జ్వాలాగ్ని ఆ రాక్షసుణ్ణి తరమసాగింది.·మరణం లేకుండా బ్రహ్మ వరం ఇచ్చినా.. ఆ అగ్నిని చూసి అతడికి భయం కలిగి.. చివరకు ఈశ్వరుని పాదాల మీద పడి శరణు కోరతాడు.
భక్త సులభుడైన శంకరుడు.. ఆ అగ్నిని తన మూడవ కన్నుగా ధరిస్తాడు. వెంటనే.. కీర్తిముఖుడు.. భయంతో మూడు లోకాలూ పరుగులెత్తటంతో తనకు బాగా ఆకలి అవుతోందనీ, తినేందుకు ఏమైనా ఇవ్వమని శివుడిని కోరతాడు.
అప్పుడు శివుడు.. ‘నిన్ను నువ్వే తిను’ అనగా, కీర్తిముఖుడు మొసలి రూపం ధరించి.. తన తోక నుంచి కంఠం వరకు కొరుక్కు తింటాడు.
అయినా ఆకలి తీరక.. మళ్లీశివుడిని ప్రార్థించగా, ‘నేటి నుంచి ప్రతి ఆలయంలోనూ దేవీదేవతల వెనక మకర తోరణంగా నిలిచి.. దర్శనం కోసం వచ్చే భక్తుల మనసులోని అహంకారాన్ని, దురాశను కొరుక్కుతిను’ అని వరమిచ్చాడు.
ఆనాటినుంచి కీర్తిముఖుడు మకర తోరణం రూపంలో ప్రతి ఆలయంలోనూ దేవతా విగ్రహాల వెనుక వున్న తోరణామధ్యభాగాన్ని తన రాక్షసముఖంతో మిగిలిపోయాడు.