Fire Accidents : దేశంలోని మహానగరాల్లో వరుస అగ్ని ప్రమాదాలు సంభవించాయి. ముంబై, అమృత్సర్తోపాటు కాన్పూర్లోనూ భారీ అగ్ని ప్రమాదాలు జరిగాయి. ముంబై ప్రమాద ఘటనలో ఏడుగురు మృతి చెందగా.. అమృత్సర్ లో జరిగిన అగ్ని ప్రమాదంలో నలుగురు మృత్యువాత పడ్డారు.
అమృత్సర్ లోని ఓ ఫార్మాస్యూటికల్ ఫ్యాక్టరీలో జరిగిన ప్రమాదంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. రసాయనాలు పెద్ద ఎత్తున ఉండటంతో భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. ఈ ఘటనలో నలుగురు మృతి చెందగా.. మరి కొంతమంది తీవ్రంగా గాయపడ్డారు. భారీ అగ్ని ప్రమాదంతో అంతా ఒక్కసారిగా ఉలిక్కిపడి భయంతో బయటకు పరుగులు తీశారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది హుటాహుటిన అక్కడకు చేరుకుని మంటలను అదుపు చేశారు. కాగా.. ప్రమాదంలో ఫ్యాక్టరీలోని లక్షలాది రూపాయల విలువైన యంత్రాలు దగ్ధమయ్యాయి. దీంతో భారీగా ఆస్తి నష్టం కూడా సంభవించింది.
యూపీలోని కాన్పూర్ భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఆర్మీ గోదాంలో ఒక్కసారిగా మంటలు చేలరేగాయి. ప్రమాదంపై సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసినప్పటికీ గోదాం పూర్తిగా దగ్ధమైంది. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరుగలేదు.