EPAPER

Head Constable Family Death : పోలీస్ రాసిన మరణశాసనం.. పక్కా పథకం ప్రకారమే హత్యలు ?

Head Constable Family Death : పోలీస్ రాసిన మరణశాసనం.. పక్కా పథకం ప్రకారమే హత్యలు ?

Head Constable Family Death : కడపలో హెడ్‌కానిస్టేబుల్‌ వెంకటేశ్వర్‌(51) కుటుంబం ఆత్మహత్య ఘటనలో ఆసక్తికర విషయాలు బయటపడుతున్నాయి. భార్య మాధవి (47), పెద్దకూతురు లాస్య (19), చిన్నకూతురు అభిజ్ఞ (16)లను కాల్చి చంపి తానూ ఆత్మహత్య చేసుకున్న ఘటన రాష్ట్రంలో తీవ్ర సంచలనం రేపింది. తొలుత కుటుంబ కలహాల కారణంగా ఈ ఘాతుకానికి పాల్పడ్డారని భావించారు. కానీ.. పోలీసులకు వెంకటేశ్వర్ రాసిన సూసైడ్‌ నోట్‌ దొరకడంతో అసలు విషయం వెలుగుచూసింది. ఆస్తికోసం రెండో భార్య రమాదేవి తీసుకొచ్చిన ఒత్తిడి కారణంగానే వెంకటేశ్వర్ భార్య పిల్లల్ని చంపి, ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు భావించారు. అతను రాసిన సూసైడ్ నోట్ ఆధారంగా.. తన మరణానంతరం డిపార్టుమెంట్‌ నుంచి వచ్చే బెనిఫిట్స్‌, జీపీఎఫ్‌.. ఆమె కొడుకు యారాసు నాగలోకేశ్వర్‌ రెడ్డికి ఉద్యోగం ఇవ్వాలని కోరారు. రమాదేవికి ఇష్టమైతే ఆమెకే ఉద్యోగం ఇవ్వాలన్నారు. రూ.10 విలువ చేసే రెండు బాండు పత్రాలను వెంకటేశ్వర్ ఈ ఏడాది జూన్‌ 26నే కొనుగోలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఈ బాండ్లపై సూసైడ్ నోట్‌లో.. తన మరణాంతరం వర్తించే ఆర్థిక సాయం, కుటుంబ పింఛన్ ను రెండో భార్య రమాదేవికి చెందేలా చూడాలని రాశాడు.


తన భార్య మాధవి చనిపోతుంది కాబట్టి ఆమె పాలసీలు కూడా రమాదేవికి వర్తించేలా చూడాలని బాండు పత్రాలపై రాశారు. ఇవన్నీ పరిశీలిస్తే వెంకటేశ్వర్‌ పథకం ప్రకారమే ఇదంతా చేసినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బాండ్‌ కాగితాన్ని జూన్‌ 26న కోనుగోలు చేశారు. ఆ రోజే అగ్రిమెంట్‌ రాసుకున్నారు. రూ.20 లక్షల విలువ చేసే భూమిని రమాదేవికి విక్రయించినట్లు అగ్రిమెంటు లేఖను కూడా గుర్తించారు. అందులో మాత్రం ఆమెను నాగేశ్వరరెడ్డి భార్యగానే పేర్కొన్నారు.

అదే తేదీన మరో 10 రూపాయల బాండ్‌ కాగితం కొన్నారు. దీనిపైనే వెంకటేశ్వర్‌ సూసైడ్‌ నోట్‌ రాసి అక్టోబర్‌ 4వ తేదీ వేశారు.ఈ రెండు డాక్యుమెంట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇవన్నీ చూసిన పోలీసులకు.. వెంకటేశ్వర్ కుటుంబం మరణించడానికి కారణం ఆమేనన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రమాదేవి ఒత్తిడి చేయడం లేదా బెదిరింపుల కారణంగానే వెంకటేశ్వర్ తన భూములు, మరణానంతరం వచ్చే లబ్ధిని ఆమెకు అందించాలని రాసినట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో రమాదేవిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. అయితే.. వెంకటేశ్వర్ కు రెండో భార్య ఉన్న విషయం తమకు తెలియదని అతని బంధువులు చెబుతున్నారు.


ఆర్థిక సమస్యలు, మరో మహిళతో వివాహేతర సంబంధం కారణంగా భార్యాబిడ్డలను కాల్చి తను కూడా రివాల్వర్‌తో కాల్చుకుని వెంకటేశ్వర్‌ ఆత్మహత్య చేసుకున్నట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. హెడ్‌కానిస్టేబుల్‌ కుటుంబం మృతిపై అన్ని కోణాల్లో దర్యాప్తు ప్రారంభించామని ఎస్పీ సిద్ధార్థ్‌ కౌశల్‌ తెలిపారు. రమాదేవిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నామని.. ఘాతుకానికి ముందు భార్యాపిల్లలకు మత్తుమందు ఇచ్చారా లేదా ఏమైనా విషప్రయోగం జరిగిందా అనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నామన్నారు.

Related News

Tirumala Laddu: ఛీ, ఇంత నీచమా? ఏపీ ప్రజల సెంటిమెంట్‌పై గట్టి దెబ్బ.. వైసీపీని ఈ పాపం వెంటాడుతుందా?

Adani Foundation: ఏపీ వరద బాధితులకు అదానీ ఫౌండేషన్ భారీ విరాళం.. ఎంతనో తెలిస్తే ఆశ్చర్యపోతారు!

Tirupati Laddu: తిరుమల లడ్డూ ప్రసాదంలో గొడ్డు మాంసం? ఇదిగో ప్రూఫ్.. ల్యాబ్ టెస్ట్‌లో బయటపడింది ఇదే

Balineni Comments: జగన్ ఏరోజూ సభల్లో నా గురించి మాట్లాడలేదు.. అందుకే పార్టీని వీడా: బాలినేని

Ambati Rambabu: నాణ్యమైన మద్యం అంటే ఏంటి..? ఎంత తాగినా ఆరోగ్యం దెబ్బతినదా..? : అంబటి ఎద్దేవా

YS Jagan: జగన్‌కు మరో భారీ షాక్… తగలనుందా..?

YV Subba Reddy: పెద్ద పాపమే చేశాడు.. చంద్రబాబుకు సుబ్బారెడ్డి కౌంటర్

Big Stories

×