IT Raids : హైదరాబాద్లో ఐటీ దాడులు కలకలం రేపుతున్నాయి. రెండో రోజు కూడా రైడ్స్ కొనసాగుతున్నాయి. ఐటీ రియల్టర్లు, చిట్ ఫండ్స్ ఫైనాన్స్ కంపెనీలే టార్గెట్గా ఉదయం 6 గంటల నుంచే అధికారులు సోదాలు చేపట్టారు. 40 ప్రాంతాల్లో ఏకకాలంలో తనిఖీలు నిర్వహిస్తున్నారు. చిట్ఫండ్ సంస్థలతో పాటు స్థిరాస్థి వ్యాపారుల ఇళ్లు, ఆఫీసుల్లో ఈ సోదాలు జరుగుతున్నాయి. పలు కీలక పత్రాలతో పాటు ఆర్థిక లావాదేవీలను పరిశీలిస్తున్నట్టుగా తెలుస్తోంది. అమీర్పేట్, శంషాబాద్, కూకట్పల్లి, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్తో పాటు పలు ప్రాంతాల్లో సోదాలు చేస్తున్నారు. అమీర్పేట లో ఉన్న పూజాకృష్ణ చిట్ఫండ్స్ సంస్థ లో 20 బృందాలు సోదాలు చేస్తున్నాయి. నిన్న జరిపిన సోదాల్లో సంస్థకు సంబంధించిన కీలక పత్రాలను అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. దాదాపు 15 గంటల పాటు సోదాలు నిర్వహించారు. శుక్రవారం ఉదయం నుంచి పూజా కృష్ణ చిట్ ఫండ్స్ డైరెక్టర్స్ సోంపల్లి నాగరాజేశ్వరి, పూజలక్ష్మి ఇళ్లతో పాటు ఎండీ కృష్ణ ప్రసాద్ ఇళ్లపై అధికారులు తనిఖీలు చేస్తున్నారు.
కాగా.. గురువారం తెల్లవారుజాము నుంచే 100 బృందాలతో ఐటీ మెరుపుదాడులకు దిగింది. చిట్ ఫండ్స్ ఫైనాన్స్ కంపెనీలు రియల్ ఎస్టేట్ వ్యాపారులే టార్గెట్గా సోదాలు నిర్వహించింది ఐటీ శాఖ. మరోవైపు ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ సోదరుడి ఇల్లు, ఆఫీస్లలో జరిగిన ఐటీ సోదాలు చర్చనీయాంశంగా మారాయి. ఆదాయపన్ను చెల్లింపుల్లో అవకతవకల ఆరోపణలపై సోదాలు కొనసాగుతున్నాయి. గురువారం ఉదయం నుంచే ఎల్లారెడ్డిగూడ, సాయిసారథినగర్లోని పూజా కృష్ణ చిట్ఫండ్స్ ప్రైవేట్ లిమిటెడ్ కార్యాలయాల్లో తనిఖీలు జరిగాయి. ఈ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ కృష్ణప్రసాద్ సహా పలువురి ఇళ్లల్లోనూ సోదాలు నిర్వహించారు.
అదే విధంగా అమీర్పేట్లోని జీవన్శక్తి చిట్ఫండ్ కంపెనీలోనూ రైడ్స్ జరిగాయి. శంషాబాద్ గోల్డన్ ఎన్క్లేవ్లోని ఓ స్థిరాస్థి వ్యాపారి ఇంటితోపాటు.. కూకట్పల్లి ఇందూ ఫార్చ్యూన్ విల్లాలోని మరో ఇద్దరు వ్యాపారవేత్తల ఇళ్లల్లోనూ తనిఖీలు చేపట్టారు. వీరు రైల్వే కాంట్రాక్ట్ పనులు చేస్తూ.. చిట్ ఫండ్ సంస్థల్లోనూ పెట్టుబడులు పెట్టినట్టు తెలుస్తోంది. ఇక తనిఖీల్లో పలు డాక్యుమెంట్లు, కంప్యూటర్ల హార్డ్ డిస్క్లు, నగదును స్వాధీనం చేసుకున్నారు. నేడు కూడా నగరంలో సోదాలు కొనసాగుతుండటంతో వ్యాపార వేత్తలు, నేతల గుండెల్లో గుబులు పుడుతోంది.